నో డెడ్లైన్: ఎలక్ట్రిక్ వెహికల్స్కు షిప్టింగ్పై నితిన్ గడ్కరీ
ఆటోమొబైల్ పరిశ్రమ నెత్తిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాలుపోశారు. విద్యుత్ వాహనాల దిశగా ఆటోమొబైల్ సంస్థలు మళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని తేల్చేశారు.
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాలా శుభవార్త చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఈ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, కార్లు, బైక్ల విక్రయాలు 19 ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలకు గడ్కరీ ప్రకటన భారీ ఊరట ఇవ్వనుంది.
2023 నుంచి 150 సీసీ లోపు ద్విచక్రవాహనాలు, 2025 నాటికి త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా పూర్తిగా మారాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాల్సిందిగా మీడియా కోరినప్పుడు కేంద్రమంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, అలాంటిదేమైనా వుంటే సంబంధిత వర్గాలను సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు.
అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. పరివర్తన సహజ ప్రక్రియగా జరుగుతుందన్నారు.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను నిషేధించదని ఇటీవల పార్లమెంటులోనూ గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు హామీ ఇచ్చిన సంగతి గమనార్హం.
ఈవీ వాహనాల పరివర్తన గడువుపై ఆటోమొబైల్ మేజర్స్ టీవీఎస్ మోటార్ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ఆకస్మికంగా ఈ మార్పును సాధించలేమని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇంతకుముందే తేల్చి చెప్పారు.
ఈ విషయంలో దేశం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ రెండూ చాలా దూరంగా ఉన్నాయన్నారు. ఫలితంగా 40 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్న ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటుందని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు.
గత కొన్ని నెలలుగా ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డిమాండ్ క్షీణించి పోవడంతో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిలో మందగమనంలో ఉందని, గత కొన్ని నెలలుగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి.
ఈ ధోరణి మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే, 10లక్షలకు పైగా ఉద్యోగ నష్టాలకు దారితీస్తుందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా పేర్కొన్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆటో పరిశ్రమ గతేడాదితో పోల్చితే 2019లో విక్రయాల్లో 31% తగ్గుదల నమోదైంది.