డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తిపై ‘మారుతి’ పునరాలోచన
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డీజిల్ ఇంజిన్ల తయారీపై పునరాలోచనలో పడింది. ఇతర సంస్థలు డీజిల్ ఇంజిన్లను కొనసాగించనున్నట్లు ప్రకటించడంతో మారుతి ఈ నిర్ణయం తీసుకున్నది. 2021 నుంచి తిరిగి డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని ప్రారంభించనుండటం గమనార్హం.
ముంబై: డీజిల్ ఇంజిన్ల తయారీని నిలిపివేయాలనే నిర్ణయాన్ని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ పునఃపరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ కథనం వెలువరించింది. కంపెనీ ప్రధాన ప్రత్యర్థులు డీజిల్ ఇంజిన్లను కొనసాగించాలని నిర్ణయించడంతో మారుతి సుజుకి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.
కాలుష్య నియంత్రణ కోసం భారత్ స్టేజ్-6 నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్ ఇంజిన్లు లాభాదాయకం కాదని మారుతి సుజుకి భావించింది. కానీ, చాలా కంపెనీలు వీటిని కొనసాగిస్తుండటంతో మార్కెట్ షేర్ భారీగా కోల్పోవాల్సి వస్తోందని ఇప్పుడు మథన పడుతున్నట్లు సమాచారం.
also read మరో రెండు నెలల్లో హీరో మోటోకార్ప్ 10 కొత్త మోడళ్లు..!
వాస్తవానికి మారుతి ఏప్రిల్ నుంచి డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేసి వచ్చే 2021 నుంచి మళ్లీ ఈ మార్కెట్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీఎస్-6కు అనుకూలంగా 1.5 లీటర్ల ఇంజిన్ను అభివృద్ధి చేసే పనిని ప్రారంభించింది.
మరోవైపు టాటా మోటార్స్, హ్యూండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాటి డీజిల్ ఇంజిన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఆయా కంపెనీలు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లపైనే దృష్టిపెట్టడంతో మారుతీ కూడా ఆ దిశగానే పయనిస్తోంది. డీజిల్ ఇంజిన్ వాణిజ్యపరంగా ఎంత వరకు లాభదాయకంగా ఉంటుందో అన్న విషయాన్ని అంచనా వేయాల్సి ఉంది.
also read ద్విచక్ర వాహన తయారీలోకి ప్రవేశించడం పొరపాటే: ఆనంద్ మహీంద్రా
అభివృద్ధి చేసే ఇంజిన్లు మారుతితోపాటు టయోటా తయారు చేసే మారుతిసుజుకి మోడళ్లకు కూడా సరఫరా చేయాల్సి ఉంటుంది. అప్పుడు భారీగా ఉత్పత్తి జరిగి ధర తగ్గే అవకాశం ఉంది. తొలుత ఫియట్ ఇంజిన్లను అనుకున్నా.. అవి కొత్త నిబంధనలను అందుకోక పోవడంతో సొంతంగానే అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. దీనిపై కంపెనీ ప్రతినిధులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
మారుతి 2018-19లో ఐదు లక్షల డీజిల్ కార్లను విక్రయించినట్లు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం ఆ సంఖ్య 3,00,000 తగ్గే అవకాశాం ఉందని కంపెనీ భావిస్తోంది. ఒక సారి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ను మారుతి తీసుకొస్తే మళ్లీ సేల్స్ పూర్వస్థితికి చేరుకొంటాయని భావిస్తున్నారు. మరోపక్క కొన్నాళ్లుగా విటార బ్రెజా, డిజైర్ టూర్ కార్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి పునరాలోచనలో పడినట్లు సమాచారం.