9.7 సెకన్లలో 100 కి.మీ వేగం.. హ్యుండాయ్ ‘ఎలక్ట్రిక్’ కోనా స్పెషాలిటీ
ఒకసారి ఛార్జ్ చేస్తే 557 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం హ్యుండాయ్ ఎలక్ట్రిక్ ‘కోనా’ కారు ప్రత్యేకత. అంతేకాదు 9.7 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారును భారత విపణిలో ఆవిష్కరించారు. దీని ధర రూ.25.3 లక్షలుగా ఉంటుంది.
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ ప్రస్తుతం ‘ఎలక్ట్రిక్ మంత్రం’ జపిస్తున్నాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ ‘కోన’ పేరుతో భారత విపణిలోకి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ను ప్రవేశపెట్టింది. దేశంలో తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇదే. కాకపోతే దీని ధర రూ.25.3 లక్షలు.
భారత ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లో కోన గేమ్చేంజర్ కానుందని హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ఒకటైన మైలేజీ సమస్యకు కోన ద్వారా పరిష్కారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇంటీరియర్, ఫీచర్లు, కారు లోపల విశాలమైన స్థలం విషయంలో క్రెటాను పోలి ఉంటుంది. కారు ముందు భాగంలో పగలు కూడా వెలిగే ఎల్ఈడీ బల్బ్లను అమర్చారు. ఈ డిజైన్ విభిన్నంగా ఉంది. ఈ కారు బంపర్కు హ్యుండాయ్ కాస్కేడింగ్ డిజైన్ గ్రిల్ను అమర్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కోన ఎలక్ట్రిక్ రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. 39.2 కిలోవాట్లు, 64 కిలోవాట్లతో పనిచేస్తాయి. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 80శాతం ఛార్జింగ్ అయ్యేందుకు గంట సమయం చాలు.
ఈ కారు కొనుగోలు చేసే ప్రయాణికులకు ఒక పోర్టబుల్ ఛార్జర్, ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్లు ఇస్తారు. పోర్టబుల్ ఛార్జర్ని త్రీ పిన్ 15 యాంపియర్స్ సాకెట్లో పెట్టి మూడు గంటలు టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 7.2కిలోవాట్ల బాక్స్ ఛార్జర్ ద్వారా గంట టాప్ అప్ ఛార్జింగ్ చేసుకొని 50 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
‘కోన’లో 100 కిలో వాట్ల మోటార్ అమర్చారు. ఇది ముందు చక్రాలకు 395 ఎన్ఎం టార్క్ వద్ద 131బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. ఇది ఏకధాటిగా 345 కి.మీ. ప్రయాణిస్తుంది. కోన మరో మోడల్ 150 కిలోవాట్ల మోటార్ను అమర్చారు. ఇది 395ఎన్ఎం టార్క్ వద్ద 200 బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. ఏకధాటిగా 557 కి.మీ. ప్రయాణిస్తుంది.
హ్యుండాయ్ కోనా కారు కేవలం 9.7 క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక సాధారణ ఎస్యూవీ కంటే ఇది చాలా ఎక్కువ వేగం. ఈ కారు మొత్తం ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్లో లభిస్తుంది.
కారులోపల 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ను అమర్చారు. దీనికి స్మార్ట్ఫోన్ను అనుసంధానించుకోవచ్చు. ఈ కారులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఆప్షన్లను ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్స్, హెడ్అప్ డిస్ప్లే ఉన్నాయి.
ఎలక్ట్రిక్ సన్రూఫ్, బై ఫంక్షన్ ఎల్ఈడీ ల్యాంప్లు, డిజిటల్ ఇన్స్ట్రమెంట్ కన్సోల్, 10రకాలుగా డ్రైవర్సీట్ను మార్చుకునే ఆప్షన్ను అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్సీ, వీఎస్ఎం, హెచ్ఏసీ, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
ఈ కారు కోసం ఛార్జింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసే పనిలో హ్యుండాయ్ నిమగ్నమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గంటలో 80శాతం ఛార్జింగ్ అయ్యేలా చేసే పరికరాలను అమర్చడానికి హ్యుందాయ్ పెట్టుబడులు పెట్టనుంది.