విపణిలోకి ‘హీరో’ డ్యాష్ విద్యుత్ స్కూటర్
నగర వాసుల అవసరాలకు అనుగుణంగా హీరో మోటో కార్ప్స్ విపణిలోకి ‘హీరో డ్యాష్’ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: నగర వాసులకు సరిపడేలా ప్రముఖ మోటారు బైక్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ విపణిలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించింది. ‘డ్యాష్ హీరో ఎలక్ట్రిక్’ పేరిట విడుదల చేసిన బైక్ ప్రారంభ ధర రూ.62,000.
విద్యుత్ వాహనాల మార్కెట్లో ఇతర సంస్థల కంటే వేగంగా తన ప్రస్థానాన్ని చాటుకోవాలని యోచిస్తోంది హీరో ఎలక్ట్రిక్ సంస్థ. ఇటీవల ఆప్టిమా ఈఆర్, ఎన్వైఎక్స్ ఈఆర్ పేరుతో రెండు వాహనాలను హైస్పీడ్ విభాగంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తక్కువ స్పీడ్ విభాగంలో సంస్థ డాష్ను అందుబాటులోకి తేవడం విశేషం.
ఈ బైక్ బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. చూసిన వెంటనే ఆకట్టుకునేలా ఉండడంతోపాటు త్వరగా ఛార్జి కావడం వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షించగలవని హీరో ఎలక్ట్రిక్ ఇండియా సీఈఓ సోహీందర్ గిల్ పేర్కొన్నారు. ఇటీవలే కంపెనీ నవీకరించిన ఆప్టిమా, ఎన్వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
48 వోల్ట్ 28ఏహెచ్ లిథియం బ్యాటరీతో సంస్థ దీనిని తయారు చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే హీరో డ్యాష్ ఎలక్టిక్ స్కూటర్ దాదాపు 60 కి.మీ. వరకు మైలేజీని ఇస్తుందని సంస్థ తెలిపింది. సిటీ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని సంస్థ ఈ వాహనం తయారు చేయడంతో దీని టాప్ స్పీడ్ను హీరో ఎలక్ట్రిక్ 25 కి.మీ.గా నిర్ణయించారు.
ఈ వాహనం బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. దీనికి తోడు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్లు, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ కన్సోల్, యూఎస్బీ చార్జింగ్ పాయింట్, ట్యూబ్లేని టైర్లు, రిమోట్ బూట్ ఓపెనింగ్ ఈ వాహనం ప్రత్యేకలు. డాష్ స్కూటర్ను లెడ్ యాసిడ్ బ్యాటరీతో కూడా తాము అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
దీని ధరను కంపెనీ రూ.45000-50,000గా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 615 డీలర్లషిప్ల ద్వారా ఈ వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్టుగా హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. 2020 నాటికి తమ ఔట్లెట్ల సంఖ్యను 1000కి చేరుస్తామని సంస్థ వివరించింది.