Asianet News TeluguAsianet News Telugu

కళ తప్పిన ఆటో ఎక్స్‌పో: బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి దిగ్గజాలు దూరం

సాధారణంగా ఆటో ఎక్స్​పోలకు చైనీయులు ఎప్పుడూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈసారి కరోనా వైరస్ వల్ల చైనా నుంచి వచ్చే వారికి వీసాలను రద్దు చేయడంతో అక్కడ నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా భారీగానే తగ్గింది

Auto Expo 2020: BMW, Toyota, Honda, and Other Leading Carmakers Will Not Be Present
Author
New Delhi, First Published Feb 9, 2020, 1:23 PM IST

న్యూఢిల్లీ: గ్రేటర్​ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్​పై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్క్‌లు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది. ఆటో ఎక్స్​పో 2020 ప్రధాన మోటార్​ షో దేశ రాజధాని హస్తినకు 30 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నది. 

మరోవైపు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఆటోమొబైల్ విడి భాగాల ప్రదర్శన సాగుతున్నది. కరోనా భయంతో ఈసారి సందర్శకుల సందడి బాగా తగ్గింది. సందర్శకుల్లో చాలా మంది ముసుగులు ధరించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్​ల పరిస్థితీ అలాగే ఉంది. 

గతంతో పోలిస్తే వాహనాల ఆవిష్కరణలు, కంపెనీల హడావుడి, వీక్షకుల సందడి ఇంతకుముందుతో పోలిస్తే తగ్గిందన్న మాట ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి వినిపిస్తున్నది. ప్రతిసారి సందర్శకులతో కిటకిటలాడే స్టాళ్ల వద్ద జనం పలుచగా కనిపిస్తున్నారు. 

సాధారణంగా ఆటో ఎక్స్​పోలకు చైనీయులు ఎప్పుడూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈసారి కరోనా వైరస్ వల్ల చైనా నుంచి వచ్చే వారికి వీసాలను రద్దు చేయడంతో అక్కడ నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య కూడా భారీగానే తగ్గింది.  ఆర్థిక మందగమనం కూడా ఇప్పటి వరకు వాహనాల అమ్మకాలపై పడింది. దీని ప్రభావం కొత్త మోడళ్ల ఆవిష్కరణపై పడింది. 

ఆటోఎక్స్​పోలో ఈసారి ముఖ్యంగా చైనా సంస్థల ప్రాతినిధ్యం, ఆసక్తి బాగా తగ్గింది. మందగమనానికి తోడు కరోనా సృష్టించిన భయమే ఇందుకు కారణం. కరోనా వల్ల ఇప్పటికే చైనాలోని పలు వాహన తయారీ యూనిట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వాహన పరిశ్రమపై ఆ దుష్ప్రభావం మరింత దారుణంగా ఉంటుంది.

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో చైనాది ఒక ప్రధాన పాత్ర. వాహనాలు మాత్రమేకాక, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వాహన విడిభాగాలను కూడా చైనాలో తయారుచేస్తారు. ఎస్​ఏఐసీ మోటార్స్, బీవైడీ, గ్రేట్​వాల్​ మోటార్స్ వంటి పలు అగ్రశ్రేణి వాహన సంస్థలు చైనాలో ఉన్నాయి. వాస్తవానికి చైనాను ప్రభావితం అంశమేదైనా అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగాన్నే ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయ పడుతున్నారు.

ఇంతకుముందు ఆటో ఎక్స్​పోలతో పోల్చితే ఈసారి 'ఆటోమొబైల్ విడి భాగాలా ఎక్స్ పో'లో చాలా తక్కువ పరికరాలు ప్రదర్శనకు రావడం ఏమాత్రం సానుకూల సంకేతం కాదు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఇంటర్ఫేస్ జరుగుతుంది. అంటే ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులకు కావాల్సిన విడిభాగాలు ఇక్కడే దొరుకుతాయని ఆశిస్తారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకోసం స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలి. అలాగే అవసరాలకు సరిపడా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయడం లాంటి లాజిస్టిక్స్​తో సహా చాలా సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.

బాడ్ సెంటిమెంట్​ను బలపరుస్తూ ఈసారి జరిగిన ఎక్స్​పోలో దిగ్గజ సంస్థలైన బీఎం​డబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్​రోవర్​ వంటి కార్ల తయారీ సంస్థలు, యమహా, హోండా, హార్లే డేవిడ్​సన్, ట్రయంఫ్ లాంటి ద్విచక్రవాహన సంస్థలు కూడా పాల్గొనలేదు. కరోనా వైరస్ ను నియంత్రించకుంటే మున్ముందు ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే విదేశీ సందర్శకుల హడావుడి కూడా ఈసారి లేకపోవడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios