Asianet News TeluguAsianet News Telugu

నవగ్రహ దోష నివారణకు ఇలా చేయాలి..

శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు,హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. వాటిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది.

navagraha dosha nivaran mantra
Author
Hyderabad, First Published Jan 6, 2020, 3:19 PM IST

 “పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
         తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

హోమాలు చేయడం వలన ప్రయోజనాలున్నాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఈ హోమాలు అనేక రకాలున్నాయి. అందులో ఒక్కొక్కదానికి ఒక్కో ప్రత్యేక ఫలితం ఉంటుంది. హోమం చేస్తున్నప్పడు వేద మంత్ర పదాలను ఆ సమయంలో శ్రద్ధగా వింటూ హోమంపై పూర్తి దృష్టిని సారిస్తేనే ప్రతిఫలం లభిస్తుంది. సంప్రదాయబద్ధంగా హోమాలు నిర్వహించాలి. ఆహార నియమాలు పాటించడం, శ్రద్ధాభక్తులతో హోమం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయి.

మనిషి తన జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం. అర్థం చేసుకుని లోక కల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం. యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం. మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలి? అని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం. తనలోని కామక్రోధ మద మాత్సర్యాలను జయించి, నియమ బద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం ఈ గుణాలను అలవరచుకుని చేసే పని పరమాత్మకు చెందుతుంది.

శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు,హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. వాటిలో ముఖ్యమైనవి హోమ ప్రక్రియ జ్యోతిర్వైద్యంగా వినియోగ పడుతుంది.హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటంవలన ఒక్కో సమిధ వలన ఆయా గ్రహం శాంతించి  ఒక్కో రోగం నివారించబడుతుంది.

ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి ( ఎనర్జీ ) భూమి మీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.

హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష పండితులు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.

హోమ పొగ కంటిలోకి పోవడం వలన కంటిలో ఉండే నలత కంటిలో నుండి నీరు రూపంలో వెళ్లి పోతుంది.హోమాగ్ని సెగ మోకాళ్ళకు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించుకోవచ్చు. గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే శుద్ధమైన ఆరోగ్యవంతులవుతారు.

రవి:- తెల్లజిల్లేడు వాత, కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్లజిల్లేడు సమిధలతో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. కళ్ళకి సంబంధించిన అనారోగ్యాలు నయమవుతాయి. కోప స్వభావాలు తగ్గుతాయి. తలనొప్పి భాధలు ఉండవు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది. 

చంద్రుడు:- మోదుగ సమిధలతో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. ఆలోచనా విధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. మోదుగ పువ్వులు, గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి కాగబెట్టుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా అవుతారు. వైద్య పరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

AlsoRead గృహప్రవేశము చేస్తున్నారా..? ఈ నియమాలు పాటిస్తే.. మీకంతా శుభమే...

కుజుడు:- చండ్ర సమిధతో హోమం చేస్తే ఎర్ర రక్త కణాల ఇబ్బందులు, ఎముకల బలహీనత ఇబ్బందులను అరికడుతుంది. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయి.

బుధుడు:- ఉత్తరేణి సమిధను హోమంలో ఉపయోగిస్తే చర్మ వ్యాదులు తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పూల్లతో గాని వేరుతో గాని రోజూ దంతధావనం చేసుకుంటే దంత దోషాలు తొలగిపోతాయి. ఉత్తరేణి ఆకులు, గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతాయి.

గురువు:- రావి సమిధలతో హోమం చేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత  రక్త దోషాలు తగ్గుతాయి. నోటిపూత పోవును. రావి చెక్క కాషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదశాస్త్రం తెలుపుతుంది.

శుక్రుడు:- మేడి చెట్టు సమిదలతో హోమంచేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదుంబర వృక్షం ( మేడి చెట్టు ) దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మ రూపంలో సుప్రతిష్టితులై ఈ వృక్ష మూలమునందు ఉంటారు. దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధుమేహవ్యాధి నివారించబడుతుంది. దీని విత్తనాలు పొడి చేసి తేనెతో కలిపి తీసుకున్నా మధుమేహం తగ్గిపోతుంది.

శని:- జమ్మి సమిధలతో హోమం చేస్తే అప మృత్యు భయం తొలగి పోతుంది. దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి. శమీ వృక్ష గాలి శరీరానికి తగిలిన శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసిన దీర్ఘకాల అనారోగ్యాలు తొలగిపోతాయి.

రాహువు:- గరికలతో హోమం చేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి, చర్మంపైన ఉన్న కురుపులపై పెట్టిన చర్మ రోగాలు నివారించబడతాయి. దెబ్బ తగిలి రక్తం కారిపోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది. 

కేతువు:- ధర్భలతో హోమం చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.

వ్యక్తిగత జాతకంలో ఏవైనా గ్రహ సమస్యలు ఉనన్ను, జాతక వివరాలు తెలియక దైనందిన జీవితంలో ఉద్యోగ, వ్యాపార, కుంటుంబ, దాంపత్య, శత్రుపీడ, నరదృషి, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు వ్యవహార చిక్కులు, వాస్తు లోపాలు, అధికార హోదా పెరుగుటకు మొదలైన వాటికి హోమ శాంతి ప్రక్రియల హోమం చేసుకుంటే శుభం కలుగుతుంది.

navagraha dosha nivaran mantra

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios