మనవడా మంగళగిరి అని స్పష్టంగా పలుకు: లోకేష్ పై లక్ష్మీపార్వతి సెటైర్లు
స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు దన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.
గుంటూరు: ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. మంగళగిరిని మందళగిరి అని లోకేష్ అనడంపై ఆమె స్పందించారు. తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని ఎద్దేవా చేశారు.
బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్కే అంటే తనకు ఎంతో అభిమానమని స్పష్టం చేశారు. చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలన్నారు.
స్వయంగా పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తే, మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దింపేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు దన్నారు. చంద్రబాబు ఒంటిపై ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని నీచమైన రాజకీయాలు చేశాడని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.
చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్కే అని కొనియాడారు. చంద్రబాబుకి, జగన్కు చాలా తేడాలున్నాయన్నారు.
జగన్ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే, చంద్రబాబు మాత్రం మామను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. జగన్పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్పై హత్యాయత్నం కూడా చేయించిన నీచుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు లక్ష్మీపార్వతి.
చంద్రబాబుకి మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు. అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడని, మరికాసేపు ప్రత్యేక హోదా అంటాడని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు.
తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్ఫోర్డ్ గ్యాడ్యుయేట్ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్ అని తిట్టిపోశారు. ఏపీకి సీఎంని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ని నిలబెట్టాడని ఆరోపించారు.
లోకేష్ని ఎక్కడ నిలబెట్టాలో అర్ధం కాక చివరికి సింహం లాంటి ఆర్కేకు ప్రత్యర్థిగా నిలబెట్టారని అన్నారు. ఆర్కేకి సింహంలా పోరాడడమే వచ్చు కానీ గుంటనక్కల్లా రాజకీయం చేయడం తెలియదన్నారు. చంద్రబాబులా 4 పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వైఎస్ జగన్కు తెలియదన్నారు.
ప్రజల కోసం ఒంటరిగా పోరాడే వ్యక్తి జగన్ అని చెప్పారు. మంగళగిరిలో ఆర్కే గెలిస్తే చరిత్ర సృష్టించినట్లేనని అభిప్రాయపడ్డారు. లోకేష్ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును నీరులా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మరో నంద్యాల ఉపఎన్నికలా చేయాలని చూస్తున్నారని అన్నారు.
వైఎస్ జగన్ సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని, అలాగే ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ఇద్దరూ సింగపూర్ పారిపోవాల్సిందేనని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.