నువ్వు బెదిరిస్తే జగన్ భయపడతాడా: బాబుకు వైఎస్ విజయమ్మ కౌంటర్
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఏకమై వైఎస్ జగన్ పై కేసులు పెట్టించి ఆస్తులు ఎటాచ్ చేయించారని ఎన్నో వేధింపులకు వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పెట్టినా నా కొడుకు భయపడలేదని, నువ్వు బెదిరిస్తే భయపడిపోతాడా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబులా వైఎస్ జగన్ది ఒకరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు.
శ్రీకాకుళం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీతో లాలూచీ పడ్డారంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ విజయమ్మ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఓదార్పుయాత్ర చేయోద్దని కాంగ్రెస్ చెప్పిన ప్రజలకు ఇచ్చిన మాట కోసం, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలనే ఏకైక లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయనపై కేసులు పెట్టించారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ఏకమై వైఎస్ జగన్ పై కేసులు పెట్టించి ఆస్తులు ఎటాచ్ చేయించారని ఎన్నో వేధింపులకు వేధించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పెట్టినా నా కొడుకు భయపడలేదని, నువ్వు బెదిరిస్తే భయపడిపోతాడా అంటూ విరుచుకుపడ్డారు.
చంద్రబాబులా వైఎస్ జగన్ది ఒకరి కాళ్ల మీదా పడే వ్యక్తిత్వం కాదన్నారు. మోదీతో, కేసీఆర్ తో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు.
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడ కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు తమను విమర్శిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్కు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం సంబంధమని నిలదీశారు. వైఎస్ జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటేసినట్లేనని చంద్రబాబు అంటున్నారని కేసీఆర్ ఆంధ్రాలో పోటీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు వైఎస్ విజయమ్మ.