నిజాలు బయటకొస్తాయనే కడప ఎస్పీ ట్రాన్స్ఫర్: సీఎం రమేశ్
కడప ఎస్పీ పనితీరుపై ఏ రాజకీయ పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
కడప ఎస్పీ పనితీరుపై ఏ రాజకీయ పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్. రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
వైసీపీ, బీజేపీ నాయకులు ఈసీని కలిసిన తర్వాత బదిలీకి సంబంధించిన ఆదేశాలు రావడం వెనుక ఆయన అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీల కుమ్మక్కు రాజకీయాల్లోకి ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ప్రవేశించిందని రమేశ్ ఆరోపించారు.
వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే ఎస్పీని బదిలీ చేయించారన్నారు. వివేకా కుమార్తె సునీతాతో ప్రెస్ మీట్లు పెట్టించి రోజుకొక మాట మాట్లాడిస్తున్నారని రమేశ్ ఎద్దేవా చేశారు.
ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేదని ఆయన భద్రతా వ్యవహారాలు చూసుకునే వ్యక్తన్నారు. ఈసీ తీరు చూస్తుంటే తమకు ఎన్నికలు ఎలా జరుగుతాయోనని ఆందోళనగా ఉందని రమేశ్ వ్యాఖ్యానించారు.