ఎగ్జిట్ పోల్స్ తప్పు... టీడీపీదే అధికారం.. కారెం శివాజీ
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో నాలుగు రోజుల సమయం ఉంది.
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో నాలుగు రోజుల సమయం ఉంది. కాగా... ఆదివారం కొన్ని జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ శాతం వైసీపీ దే అధికారమని తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో.. ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అంటున్నారు టీడీపీ నేత కారెం శివాజీ.
సోమవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. ఏపీలో టీడీపీ విజయం సాధించడం చారిత్రక అవసరమని టీడీపీ నేత కారెం శివాజీ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల నాడిని పట్టలేకపోయాయన్నారు.
మరోసారి చంద్రబాబే సీఎం అవుతారన్నారు. యూనివర్శిటీల్లో ఇంకా కులవివక్ష పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వీసీల వ్యవహారశైలిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్నామని కారెం శివాజీ పేర్కొన్నారు.