అనంతలో టీడీపీకి షాక్.. పార్టీని వీడిన సీనియర్లు
ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగలింది. సరిగ్గా ఎన్నికలకు 10 రోజులు కూడా లేదనగా.. అనంతపురంలో పలువరు సీనియర్లు పార్టీని వీడారు.
ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్ తగలింది. సరిగ్గా ఎన్నికలకు 10 రోజులు కూడా లేదనగా.. అనంతపురంలో పలువరు సీనియర్లు పార్టీని వీడారు. వారంతా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.
మడకశిర టీడీపీ జడ్పీటీసీ, ప్రముఖ టీడీపీనేత కరణాకర్రెడ్డి సతీమణి సులోచనమ్మ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలోని అధికారులకు అందించారు.వెంటనే తాను జడ్పీటీసీ పదవికి ఇచ్చిన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
ఒకప్పుడు మడకశిర నియోజకవర్గ రాజకీయాలను శాసించిన మాజీ ఎమ్మెల్యేలు వైసీతిమ్మారెడ్డి, వైవీ తిమ్మారెడ్డి కుటుంబానికి చెందిన సులోచనమ్మ టీడీపీ జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
మడకశిర మండలంలో సులోచనమ్మ భర్త కరుణాకర్రెడ్డి టీడీపీలో ముఖ్య నాయకుడు.ఆయనకు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి ఈరన్నతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనను ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి,టీడీపీ అభ్యర్థి ఈరన్న బుజ్జగించినా ఫలితం లేదు. ఎట్టి పరిస్థితిలో టీడీపీలో ఉండమని ఆయన వారికి తేల్చి చెప్పారు.
ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ముఖ్యనేతలంతా పార్టీని వీడటం పార్టీ నేతలను కలవరపెడుతోంది. కాగా.. పార్టీని వీడిన నేతలంతా శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.