మానాన్నకు ఓటెయ్యండి, మీరు మాకు ఓటెయ్యండి: ప్రత్యర్థుల అభ్యర్థనలు
తన తండ్రి ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఓటెయ్యాలంటూ మాగంటి రాఘవరెడ్డి దామచర్ల జనార్థన్ ను కోరారు. దామచర్ల జనార్థన్ సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావుకు ఓటు వెయ్యాలని కోరారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నవ్వులు విరిశాయి.
ఒంగోలు: ఒంగోలు జిల్లాకేంద్రంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాకర్స్ ను కలిసేందుకు టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ వెళ్తుండగా అదే రోడ్డులో వైసీపీ ఓంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగంటి శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగంటి రాఘవరెడ్డిలు ఒకరినొకరు ఎదురెదురుగా తారసపడ్డారు.
స్థానిక రంగరాయుడు చెరువు కట్టపై వీరిద్దరు కలుసుకున్నారు. ఇరువురు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కాంపైన్ పై చర్చించుకున్నారు. అనంతరం వెళ్లిపోతూ తన తండ్రి ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఓటెయ్యాలంటూ మాగంటి రాఘవరెడ్డి దామచర్ల జనార్థన్ ను కోరారు.
దామచర్ల జనార్థన్ సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి శిద్ధా రాఘవరావుకు ఓటు వెయ్యాలని కోరారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నవ్వులు విరిశాయి. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆసక్తికర సన్నివేశం ప్రత్యక్షం కావడంతో అంతా కాసేపు నవ్వుకున్నారు.