ఈసీ తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారని కనకమేడల అన్నారు. అయినా ప్రజలంతా పట్టుదలతో అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని మొదటి నుంచీ తాము చెబుతూనే ఉన్నామని తెలిపారు.

ఢిల్లీ: ఈవిఎంల మొరాయింపుపై వైఎస్సార్ కాంగ్రెసు నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, దీన్ని బట్టే కుట్రేదో జరిగిందనే అనుమానం వస్తోందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఏపీలో పోలింగ్ నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. 

ఈసీ తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారని కనకమేడల అన్నారు. అయినా ప్రజలంతా పట్టుదలతో అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని మొదటి నుంచీ తాము చెబుతూనే ఉన్నామని తెలిపారు. తాము ఆరోపించినట్టుగానే పోలింగ్ జరిగిందన్నారు. 

ఏపీలో మాదిరిగానే మిగతా రాష్ట్రాల్లో కూడా అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈవీఎంలలో తలెత్తిన సమస్యల వల్ల ఎవరికి ఎవరు ఓటు వేశారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లు కూడా లెక్కించాలని ఈసీని కోరతామని ఆయన చెప్పారు. 

జగన్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కేసీఆర్‌తో స్నేహం చేయాలని జగన్ కూడా తాపత్రాయం పడుతున్నారని చెప్పారు. జగన్‌కు రాష్ట్ర ప్రజల కన్నా కేసీఆరే ముఖ్యమని విమర్శించారు.