డమ్మీ అభ్యర్థి ఏకంగా మంత్రయ్యారు
డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఓ వ్యక్తి ఏకంగా మంత్రిగా పనిచేసిన చరిత్ర విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది. విశాఖ జిల్లాలోని మాడ్గుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
విశాఖపట్టణం: డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఓ వ్యక్తి ఏకంగా మంత్రిగా పనిచేసిన చరిత్ర విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది. విశాఖ జిల్లాలోని మాడ్గుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేసిన సమయంలో విశాఖ జిల్లా మాడ్గులకు చెందిన టీచర్ రెడ్డి సత్యనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టీడీపీ సభ్యత్వాన్ని చేర్పించారు. రెడ్డి సత్యనారాయణ టీచర్ కావడంతో అతడిని అందరూ కూడ మాస్టార్ అని ఆప్యాయంగా పిలుచుకొనేవారు.
మాడ్గుల అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా అల్లు భానుమతిని ఎన్టీఆర్ ఖరారు చేశారు. ఆమెకు డమ్మీ అభ్యర్ధిగా రెడ్డి సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొన్ని కారణాలతో భానుమతి నామినేషన్ను తిరస్కరించారు. డమ్మీ నామినేషన్ దాఖలు చేసిన రెడ్డి సత్యనారాయణ టీడీపీ అధికారిక అభ్యర్ధి అయ్యారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆయన విజయం కూడ సాధించారు.
వరుసగా ఈ అసెంబ్లీ స్థానం నుండి ఆయన నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాలుగు దఫాలు కూడ టీడీపీ అభ్యర్ధిగానే ఆయన పోటీ చేశారు. 1988లో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా సత్యనారాయణకు ఎన్టీఆర్ కేబినెట్లో చోటు దక్కింది.