భూవ్యాపారం చేసుకోవడానికి లోకేష్ మంగళగిరి వచ్చారు.. జీవీఎల్
భూవ్యాపారం చేసుకోవడానికి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడని బీజేపీ నేత జీవీఎల్ అభిప్రాయపడ్డారు. గురువారం జీవీఎల్, ఐవైఆర్ కృష్ణారావులు కలిసి మీడియాతో మాట్లాడారు.
భూవ్యాపారం చేసుకోవడానికి లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడని బీజేపీ నేత జీవీఎల్ అభిప్రాయపడ్డారు. గురువారం జీవీఎల్, ఐవైఆర్ కృష్ణారావులు కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రజలు ఆలోచించి.. మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అర్హతలేని రాజకీయ వారసులను ఓడించాలి’ అని ఐవైఆర్ అన్నారు.
అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ...మంగళగిరికి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యముందన్నారు. అధికార బలంతో, ధనబలంతో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవాలనుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. స్థానికేతరుడైన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
భూ వ్యాపారం చేసుకోడానికి, వేలకోట్ల నల్లధనం దాచుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పారు. అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారన్నారు. మంగళగిరిపై లోకేష్కు ఎలాంటి ప్రేమలేదని చెప్పారు. అభివృద్ధి పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.