Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయం తలచుకుని ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఏడ్చారు

పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపు కుంకుమ తుడిచింది చంద్రబాబేనని ఆరోపించారు. అలాంటిది పసుపు కుంకుమ అంటావా అంటూ నిలదీశారు. అందరూ వద్దన్నా అల్లుడనే కారణంగా చంద్రబాబును తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

ex minister motkupalli narasimhulu comments on chandrababu
Author
Hyderabad, First Published Apr 8, 2019, 3:18 PM IST

హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. అవినీతి సొమ్ముతో రాబోయే ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి వెన్నుపోటు, అక్రమాలకు చంద్రబాబు మారుపేరంటూ ఆరోపించారు. చంద్రబాబు జిమ్మిక్కులు నమ్మకుండా రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ ను గెలిపించాలని కోరారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపు కుంకుమ తుడిచింది చంద్రబాబేనని ఆరోపించారు. 

అలాంటిది పసుపు కుంకుమ అంటావా అంటూ నిలదీశారు. అందరూ వద్దన్నా అల్లుడనే కారణంగా చంద్రబాబును తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఏడ్చారని గాంధీని చంపిన గాడ్సే  కంటే చంద్రబాబు నీచుడని ఎన్టీఆర్ అన్నారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని దొంగిలించిన దొంగ చంద్రబాబు అయితే తాను పెట్టిన పార్టీకి ఏకైక మెనగాడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. 

వైఎస్‌ జగన్‌ సొంత పార్టీతో ఒంటరిగా వెళుతున్నారని తెలిపారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి  చనిపోతే సాటిమనిషి ప్రాణం పోయిందన్న బాధ లేకుండా ప్రత్యర్థి చనిపోయాడన్న సంతోషమే చంద్రబాబు ముఖంలో కనిపించిందన్నారు. చంద్రబాబు శాడిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. 

వైఎస్‌ జగన్‌ మీద 31 కేసులు ఉన్నాయని చెప్తున్న చంద్రబాబు నీ మీద 29 కేసులున్న సంగతి మర్చిపోకని హితవు పలికారు. 29 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. 

అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఈ రోజు నీ కోసం, నీ కొడుకు కోసం మాత్రమే బతుకుతున్నావ్ తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం అన్ని సర్వేలు వైఎస్‌ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడిస్తున్నాయన్నారు. 

చంద్రబాబువి అన్నీ దొంగ సర్వేలన్న మోత్కుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొద్దున లేస్తే చాలు కేసీఆర్‌ను తిడుతున్నావు. కేసీఆర్ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవంటూ మోత్కుపల్లి ధ్వజమెత్తారు. 

వైఎస్‌ జగన్‌ ఆంధ్రుల హక్కుల కోసం పోరాడితే చంద్రబాబు ఒక్కరోజు కూడా ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేయలేదని విమర్శించారు. మొన్నటిదాకా మోదీ గ్రేట్ అని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు చెడ్డవాడు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబుది నాలుకా లేక తాటి మట్టా అని నిలదీశారు. 

ప్రత్యేక హోదా కోసం ఒక్కనాడైనా పోరాడావా? నీకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ఏడు మండలాలు ఏపీలో కలిపిన కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదన్నారు. కేసీఆర్‌ను కలుపుకొని ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు. 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విభజన చట్టం కింద 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైద్రాబాద్‌ నుంచి పారిపోయారని విమర్శించారు. తనకు కులం లేదని అంటున్న చంద్రబాబు కుల అహంకారి అంటూ విరుచుకుపడ్డారు. 

మాల, మాదిగలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారు అని నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అంటూ విరుచుకుపడ్డారు. రూ.100 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios