ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు: ఈవిఎంలపై సీఈసీకి ఫిర్యాదు
తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కొంత మంది జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జట్టు సభ్యులతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసి) చీఫ్ సునీల్ అరోరాను కలిసి ఈవిఎంలపై ఫిర్యాదు చేయనున్నారు.
తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కొంత మంది జాతీయ నాయకులను కూడా కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు కార్యక్రమాలను టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు సమన్వయం చేస్తున్నారు.
చంద్రబాబు వెంట 19 మంది నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. సీఈసితో భేటీ తర్వాత చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఈవీఎంలపై, వివీప్యాట్ లపై ఆయన జాతీయ మీడియాకు వివరిస్తారు. ఈవిఎంలపై చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.
చంద్రబాబు వెంట కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, సిఎం రమేష్, చిన రాజప్ప, కె రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కేశినేని నాని, నక్కా ఆనందబాబు, నారాయణ రావు, అశోక్ గజపతి రాజు, కె. రామ్మోహన్ నాయుడు, ఎన్ శివప్రసాద్, మల్యాద్రి, గంటా శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు ఉన్నారు.