వైసీపీ నేత కొడాలి నానిపై బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో నీతివంతుడైన అవినాష్ కి, క్రిమినల్ అయిన కొడాలి నానికి మధ్య పోటీ జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
వైసీపీ నేత కొడాలి నానిపై బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో నీతివంతుడైన అవినాష్ కి, క్రిమినల్ అయిన కొడాలి నానికి మధ్య పోటీ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. వారిద్దరి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి అవినాష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని బుద్ధా వెంకన్న కోరారు.
సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడే స్థాయి నానికి లేదన్నారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బుద్ధా వెంకన్న ప్రసంగించారు. కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. తాను గెలవడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా నాని సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
గుడివాడలో నాని ‘బల్లాల దేవా’ లాంటి వాడు అయితే.. అవినాష్ ‘బాహుబలి’ లాంటి వాడని పేర్కొన్నారు. నానిని గుడివాడ నుంచి పంపించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటమి భయంతోనే అవినాష్పై నాని దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. డబ్బు రాజకీయాలకు ప్రజలు మోసపోరని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే గుడివాడను మరో కుప్పం లాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుడివాడ అభివృద్ధి నిరోధక శక్తిగా నాని మారాడని ధ్వజమెత్తారు. మరోసారి చంద్రబాబు గురించి నోరుజారితే సరైన గుణపాఠం చెబుతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.
