అక్కడ పవన్ గెలుపు కష్టమే : బీజేపీ నేత రఘురాం
పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి వాళ్లు ఏం మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్ కాపీలు తయారు చేసి ఇస్తుందని విమర్శించారు. గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనంటూ వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి రఘురాం స్పష్టం చేశారు. జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంట్రోల్ లోనే ఉన్నారని ఆరోపించారు.
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్, కేఏ పాల్ లాంటి వాళ్లు ఏం మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ జిరాక్స్ కాపీలు తయారు చేసి ఇస్తుందని విమర్శించారు. గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం లేదని, భీమవరంలో ఆయన గెలుపు కష్టమేనంటూ వ్యాఖ్యానించారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణలో సిన్సియారిటీ లేదని విమర్శించారు. చంద్రబాబు సలహాతోనే ఆయన జనసేన పార్టీలో చేరారని రఘురాం ఆరోపించారు. మరోవైపు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడుకి, టీడీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుందని ధ్వజమెత్తారు.
నిరాశ నిస్పృహలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కన్నా లక్ష్మీనారాయణల మీద టీడీపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 20 ఏళ్లుగా చంద్రబాబు ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకునే ఉన్నారని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు మాత్రం ఒడిపోతామనే భయంతో రహస్య పొత్తులు పెట్టుకున్నారని రఘురాం ఆరోపించారు.