మీ ఓటు నాకా.. జగన్ నేరాలకా: చంద్రబాబు
విదేశాలకు వెళ్లాలంటే వెరిఫికేషన్ చేస్తారని, మరి 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు
విదేశాలకు వెళ్లాలంటే వెరిఫికేషన్ చేస్తారని, మరి 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు . ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆదివారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన....సంపద సృష్టి గురించి వైసీపీ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదని, రాజధాని, నదుల అనుసంధానం గురించి జగన్ చెప్పలేదని సీఎం విమర్శించారు.
అమరావతి అభివృద్ధి, జిల్లాలు, మండలాలు పారిశ్రామికీకరణపై జగన్కు అవగాహన లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇన్ని నేరాలు ఉన్న వ్యక్తిని నమ్మి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా..? అని సీఎం ప్రశ్నించారు.
టీడీపీకి వేసే ఓటు చంద్రబాబుకు ఓటుగా చెప్పాలని.. వైసీపీకి వేసే ఓటు జగన్ నేరాలకు ఓటుగా చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు టీడీపీకే వేసేలా చూడాలని నేతలకు సూచించారు.
తొలి ఓటు నేరాలు ఘోరాల పార్టీకి వేస్తే జీవితాంతం క్షోభ అనుభవించినట్లుగా ఉంటుందన్నారు. 97 మంది నేరగాళ్లను నిలబెట్టిన పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? ఉద్యోగాలకు వెళ్లేవారికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారని, జగన్కు అలాంటివేవీ ఉండవని చంద్రబాబు దుయ్యబట్టారు.