పచ్చచొక్కాలు విడిపిస్తాం: పోలీసులకు జగన్ వార్నింగ్
అధికారంలోకి రాగానే పోలీస్ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు
కర్నూల్: అధికారంలోకి రాగానే పోలీస్ బాసులకు చంద్రబాబు నాయుడు వేసిన పచ్చచొక్కాలను విప్పుతామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు
సోమవారం నాడు కర్నూల్ జిల్లా ఆదోనిలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలకు జగన్ పలు హామీలు ఇచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కిందిస్థాయి ఉద్యోగులు, హోంగార్డులకు మెరుగైన జీతాలతో పాటు.. వారానికో సెలవు ఇస్తామని హామీ ఇచ్చారు
తమ పార్టీ అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు. చిరు వ్యాపారులకు రూ. 10 వేలను వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామన్నారు.
సరైన దరలు లేక రైతాంగం ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతాంగం సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడ తాము అనేక కార్యక్రమాలను చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు.