కేసీఆర్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు: బాబును ప్రశ్నించిన వైఎస్ విజయమ్మ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.
విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.
బుధవారం నాడు ఆమె విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఏపీలో కేసీఆర్ పోటీ చేస్తున్నారా... ఆయనను ఓడించాలని ఎందుకు చంద్రబాబునాయుడు ఇక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆమె అడిగారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రను అర్ధం చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.
ఇసుక, మట్టి, రాజధాని, విశాఖ భూములను కూడ టీడీపీ నేతలు వదల్లేదని ఆమె ఆరోపించారు. విజయనగరం జిల్లా అంటే వైఎస్ఆర్కు చాలా ప్రేమ అని ఆమె గుర్తు చేసుకొన్నారు. రాయలసీమ మాదిరిగానే విజయనగరం జిల్లా కూడ అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఆమె చెప్పారు. గజపతినగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేసిందా అని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు తరహాలోనే స్థానిక ఎమ్మెల్యే కేఏ నాయుడు ప్రజలను దోచుకొంటున్నారని ఆమె ఆరోపించారు. అనుభవం ఉన్న నేతగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలముందు 600కు పైగా హామీలను ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.