ఐదేళ్లు లోకేష్ భవిష్యత్తు కోసమే పనిచేశారు: బాబుపై వైఎస్ షర్మిల
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు. ఐదేళ్ల పాటు లోకేష్ భవిష్యత్తు మాత్రమే బాబు తీసుకొన్నారని ఆమె ఆరోపించారు.
తణుకు: పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిల విమర్శించారు. ఐదేళ్ల పాటు లోకేష్ భవిష్యత్తు మాత్రమే బాబు తీసుకొన్నారని ఆమె ఆరోపించారు.
శుక్రవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో ఆమె పాల్గొన్నారు. రాజన్న రాజ్యం ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరికి మేలు చేసేలా వైఎస్ఆర్ పాలన సాగించారని ఆమె చెప్పారు. ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు బాబు ద్రోహం చేశాడని ఆమె ఆరోపించారు.రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్న సీఎం కావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదని ఆమె ఎద్దేవా చేశారు. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూడ అమలు చేయలేదన్నారు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ బిక్షం వేస్తున్నాడని ఆమె విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 15 వేల కోట్ల నుండి రూ. 60 వేల కోట్లకు పెంచారని ఆమె ఆరోపించారు. మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టును ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబునాయుడు 600 హామీలను ఇచ్చాడన్నారు. కనీసం ఒక్క హామీని కూడ అమలు చేయలేదన్నారు.