తమ పార్టీకి మరోసారి అధికారాన్ని ఇస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.సోమవారం నాడు కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

కడప: తమ పార్టీకి మరోసారి అధికారాన్ని ఇస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.సోమవారం నాడు కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

సీపీఎస్‌ విషయమై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఈ విషయమై ఉద్యోగులకు న్యాయం చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని బాబు హామీ ఇచ్చారు. జమ్మలమడుగులోనే ఈ విషయాన్ని తొలిసారిగా ప్రకటించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా ఆదుకొన్నట్టుగా బాబు గుర్తు చేశారు

జగన్ మహానాయకుడు... నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతాడని ఆయన ఎద్దేవా చేశారు. ముద్దనూరు ప్రాజెక్టును మూసివేసే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని బాబు చెప్పారు.

వృద్ధులకు పెన్షన్లను అధికారంలోకి రాగానే మూడు వేలకు పెంచుతామని ఆయన చెప్పారు. పసుపు కుంకుమ కింద ఆడపడుచులకు డబ్బులకు రాకుండా వైసీపీ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.24,500 కోట్లను రుణ మాఫీ చేశామని చెప్పారు.రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు కూడ ఈ పథకాన్ని అమలు చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

తన జీవితంలో జగన్ ఒక్క మాట కూడ నిజం చెప్పారా అని ప్రశ్నించారు. కేసుల నుండి తప్పించుకొనేందుకు జగన్ ఏపీ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టాడని ఆయన ఆరోపించారు.

మాట ఇచ్చి తప్పేవారికి , మోసం చేసే వారికి పాలించే హక్కు లేదని మహాభారతంలో నన్నయ్య చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన ఆస్తులను దోచుకొన్న వ్యక్తి కేసీఆర్.. అలాంటి కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.జగన్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని బాబు వివరించారు. పులివెందులకు నీరిచ్చిన తర్వాతే కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కడప జిల్లాలో ప్రశాంతత కోసం రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను కలిపానని బాబు చెప్పారు. కర్నూల్‌లో కేఈ, కోట్ల కుటుంబాలను అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల కుటుంబాలను, విజయనగరంలో బొబ్బిలి, విజయనగరం రాజులను కలిపిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.