తెలంగాణలో నాకే గౌరవం లేకుండా పోయింది: చంద్రబాబు
తెలంగాణలో నాకే గౌరవం లేకుండా పోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మకూరు: తెలంగాణలో నాకే గౌరవం లేకుండా పోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.హైద్రాబాద్ కేంద్రంగా 9 ఏళ్ల పాటు సీఎంగా, 10 ఏళ్ల పాటు ప్రతిపక్షనేతగా పనిచేశానని చెప్పారు.
తెలంగాణలో తనకే గౌరవం లేకుండా పోయిందని బాబు గుర్తు చేశారు. కేసీఆర్ ఇష్టారీతిలో మాట్లాడారని చెప్పారు. తనతో పాటు ఏపీ ప్రజలను కూడ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని చెప్పారు.
హైద్రాబాద్లో తన కార్యాలయంలో తొలుత తాను కూర్చొనేందుకు కనీసం కుర్చీ కూడ లేకుండాపోయిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.హైద్రాబాద్ కంటే అమరావతిని అభివృద్ధి చేస్తానని బాబు చెప్పారు.
కేసీఆర్ సెక్రటేరియట్కు వచ్చాడా, అసెంబ్లీకి వచ్చాడా అని చంద్రబాబునాయుడు విమర్శించారు. బంగారు బాతు గుడ్లు పెట్టేలా హైద్రాబాద్ను తయారు చేస్తే...దాని ఆదాయాన్ని అడ్డుపెట్టుకొని మనపై పెత్తనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని బాబు ఆరోపించారు.
తనకు అడుగడుగునా జగన్ అడ్డం పడ్డారని బాబు ఆరోపించారు. . నాగార్జున సాగర్ నుండి సోమశిలకు నీరిస్తామని బాబు హామీ ఇచ్చారు. జగన్ పట్టిసీమను అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు.
మోడీ, కేసీఆర్, జగన్ నెత్తిన రూ. 100 పెట్టి అమ్మినా కూడ రూ. 10లకు కూడ కొనుగోలు చేయరని చంద్రబాబునాయుడు విమర్శించారు. మోడీ ఆధునిక నియంత అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో ఉండి అన్ని పనులు చేసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీలో అన్ని రకాలుగా గౌరవించినట్టు బాబు చెప్పారు. పెళ్లిపీటల నుండి పారిపోయాడని ఆదాల ప్రభాకర్ రెడ్డిపై చంద్రబాబునాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.టిక్కెట్టు ఇచ్చినా కూడ పోటీ చేయకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి పారిపోయాడని చెప్పారు.
పనుల కోసం ప్రభాకర్ రెడ్డి అనేక కథలు తనకు చెప్పాడన్నారు. పనులు అయిపోగానే ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారని ఆయన విమర్శించారు. నేరస్తుడు జగన్ పెద్ద నేతగా కన్సిస్తే ప్రభాకర్ రెడ్డి తన వద్దకు ఎందుకు వచ్చారో చెప్పాలని చంద్రబాబు ప్రభాకర్ రెడ్డిని డిమాండ్ చేశారు.