చంద్రబాబు ప్రచారం: ప్రతి రోజూ బహిరంగ సభ, రోడ్షోలు
ఈ నెల 16వ తేదీ నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ ఓ భారీ బహిరంగ సభతో పాటు రోడ్షో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అమరావతి: ఈ నెల 16వ తేదీ నుండి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ ఓ భారీ బహిరంగ సభతో పాటు రోడ్షో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్ధులను ప్రకటించాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.రేపటితో పార్లమెంట్ నియోజకవర్గాల్లో బాబు సమీక్షలు పూర్తి కానున్నాయి.
ఇప్పటికే దాదాపుగా అభ్యర్ధుల ఖరారు కూడ ఫైనల్ అయింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల 10 నుండి 15వ తేది లోపుగా అభ్యర్ధుల జాబితాను చంద్రబాబునాయుడు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఈ నెల 16వ తేదీన చంద్రబాబునాయుడు ప్రజా దర్బార్ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడి నుండి ప్రారంభిస్తారనే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. ప్రతి సారీ ఎన్నికల ప్రచారం తిరుపతి నుండి ప్రారంభించడం టీడీపీకి ఆనవాయితీ. ఈ దఫా కూడ తిరుపతి నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి రోజూ ఒక బహిరంగ సభతో పాటు వీలైనన్ని రోడ్షోలు ఉండేలా టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.