మా అభ్యర్థులే లక్ష్యంగా ఐటీ దాడులు: మోడీపై చంద్రబాబు ఫైర్
టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
గిద్దలూరు: టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
గురువారం నాడు గిద్దలూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.నిన్న సుధాకర్ యాదవ్ ఇంటిపై, ఇవాళ గుంటూరులో నాని అనే తమ పార్టీ నేత ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించారని బాబు చెప్పారు.
నీ ఉద్యోగం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోడీకి బాబు సూచించారు. తమ ఉసురు మీకు తగులుతుందని మోడీపై బాబు శాపనార్ధాలు పెట్టారు.
మోడీ నిన్ను ప్రజలు అసహ్యించుకొనే రోజులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే అభ్యర్థులు ఎవరూ కూడ లేరా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థులను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ఆయన మోడీని ప్రశ్నించారు.
ఐటీ దాడులు చేయిస్తే తమ పార్టీ అభ్యర్థులు భయపడి ప్రచారానికి దూరంగా ఉంటారని మోడీ ప్లాన్ చేశారని బాబు ఆరోపించారు. అయినా తమ పార్టీ నేతలెవరూ కూడ భయపడకుండా ప్రచారం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు.
నరేంద్ర మోడీ ఒక్క దాడి చేస్తే పది సీట్లు అదనంగా గెలుస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. తెలంగాణలోని హైకోర్టులో గన్నవరం ఎమమెల్యే వల్లభనేని వంశీపై కేసు కొట్టిస్తే కింది కోర్టులో కేసు వేసి నాన్బెయిలబుల్ వారంట్ చేయించారని బాబు ఆరోపించారు. కేసీఆర్ నిన్ను కూడ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
తనతో పాటు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, జగన్తో పాటు ఉంటే జైలుకు వెళ్తారని చంద్రబాబునాయుడు యువతకు హితవు పలికారు. పండుగలకు రెండు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వెలుగోడు ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని గ్రామాల్లో చెరువులకు పూడికలు తీయిస్తామన్నారు.