చంద్రబాబుకు గేట్స్ క్లోజ్: అమిత్ షా
ఏన్డీఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు.
నర్సరావుపేట: ఏన్డీఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చి చెప్పారు.
గురువారం నాడు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోతే మళ్లీ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వదిలేస్తారని ఆయన జోస్యం చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాది అంటూ బాబుపై నిప్పులు చెరిగారు అమిత్ షా.
2004లో బీజేపీ ఓటమి పాలు కాగానే చంద్రబాబునాయుడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.2014లో మోడీ హవాను చూసి చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కూడ పొత్తు పెట్టుకొంటున్నారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణలో 3.5 శాతం ఓట్లు కూడ రాని కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పొత్తుకు టీడీపీ దూరంగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే సంకేతాలు బాబుకు అందడంతో ఎన్డీఏలోకి వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అమిత్ షా చెప్పారు.