టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇలాకాలోని కుప్పం మున్సిపాలిటీని (Kuppam municipal result)  వైసీపీ(YSRCP) కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (peddireddy ramachandra reddy) , చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ (YS Jagan) అభినందించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇలాకాలోని కుప్పం మున్సిపాలిటీని వైసీపీ(YSRCP) కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ ఫాలోవర్స్ అయితే.. జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్‌లో #YSJaganMarkInKuppam ట్యాగ్‌ను జత చేస్తూ పోస్టులు చేస్తున్నారు. 

అయితే కుప్పంలో వైసీపీ విజయం వెనక ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (peddireddy ramachandra reddy)  కృషి ఉందనే చెప్పాలి. తనదైన వ్యుహాలతో ముందుకు సాగిన పెద్దిరెడ్డి కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేశారు. ప్రతిష్టాత్మక తీసుకని కుప్పంలో వైసీపీని గెలిపించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన పెద్దిరెడ్డి కుప్పం గురించి  ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతకు ముందు ఎప్పుడు తాము కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని.. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి గెలిచామని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు నమ్మలేదని అన్నారు. 

ఇదిలా ఉంటే Kuppamలో విజయంతో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (YS Jagan) ‌ కూడా ఫుల్ సంబరపడ్డారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చిత్తూరు జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దిరెడ్డితో కలిసి దిగిన ఫొటో చూస్తే ఎంత సంతోషపడుతున్నాడో అర్థమవుతుంది. అందులో జగన్, పెద్దిరెడ్డి ఇద్దరు నవ్వుతూ కనిపించారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని చూసి వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. 

కుప్పం మున్సిపాలిటిలో మొత్తం 25 స్థానాలు ఉండగా.. 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో.. మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవంతో కలిపి వైసీపీ 19 స్థానాలు సొంతం చేసుకుని కుప్పం మున్సిపల్ పీఠం దక్కించుకుంది. ఇక, టీడీపీ 6 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. ఇక, దర్శి మినహా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ, నెల్లూరు కార్పొరేషన్‌ను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.  

Also read: Kuppam municipal election result: చంద్రబాబును పుంగనూరు‌లో పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నా.. మంత్రి పెద్దిరెడ్డి

ఇక, కుప్పంలో పాగా వేసేందుకు వైసీపీ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఉంది. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 2014 నుంచి చూస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో గెలుపు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి మరోసారి విజయం సాధించినప్పటికీ.. వైసీపీ అభ్యర్థికి కూడా భారీగానే ఓట్లు పోలయ్యాయి. 2019లో భారీ మెజారిటీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత.. కుప్పంపై ఆ పార్టీ మరింతగా ఫోకస్ పెంచింది.

గత కొంతకాలంగా జరిగిన ప్రతి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెండింగ్‌లో ఉన్న కుప్పం మున్సిపాటిటీ ఇటీవల ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అంతకు ముందు నుంచే కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. గత మూడు నెలలుగా కుప్పంలో విజయం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. నోటఫికేషన్ వెలువడిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన నేతలు అంతా కుప్పంలో పర్యటించారు. పోల్ మెనేజ్‌మెంట్ కూడా చేశారు.