4 ఏళ్ళుగా ఐసీయూలోనే బాబు సర్కార్, త్వరలోనే మరణం: తమ్మినేని
బాబుపై వైసీపీ నేత తమ్మినేని ధ్వజం
విజయవాడ: నాలుగేళ్ళ పాటు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఐసీయూలోనే ఉందని, త్వరలోనే ప్రభుత్వం మరణానికి గురికానుందని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం జోస్యం చెప్పారు.నాలుగేళ్ళ టిడిపి పాలనపై వైసీపీ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంతో పాటు ఇతర నేతలు చార్జీషీట్ ను శుక్రవారం నాడు విడుదల చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీపై తొలి సంతకం చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయాన్ని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. రుణమాఫీలో కూడ అనేక ఆంక్షలు పెట్టడం వల్ల రూ.87 వేల కోట్ల రుణమాఫీ కేవలం రూ.24 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కుదించిందని ఆయన విమర్శించారు. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హమీని కూడ అమలు చేయలేదన్నారు.
చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తోందని ఇచ్చన హమీలు అమలుకు నోచుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హమీని కూడ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 1.45 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హమీ కూడ అమలుకు నోచుకోలేదన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీని మేనిఫెస్టో రూపంలో విడుదల చేశారని కానీ,టిడిపి వెబ్సైట్ నుండి మేనిఫెస్టోను మాయం చేశారని తమ్మినేని విమర్శించారు.
కమీషన్ల కోసమే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.కేంద్రం నుండి తమ చేతుల్లోకి తీసుకొని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదని ఆయన బాబుపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ వ్యవస్థలను బాబు భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు.
బాబు రాజకీయ వ్యభిచారని ఆయన విమర్శించారు. తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకొన్నారని వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినా కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని బాబుకు తమ్మినేని సీతారామ్ సవాల్ విసిరారు.