విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తూనే వున్నారు. తాజాగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
రాగమాలిక సీడీషాప్ను అడ్డగా చేసుకుని రంగా హత్యకు ప్లాన్ చేశారని వ్యాఖ్యానించారు. రంగాను కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లలో వెలగపూడి ఒకరని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
వెలగపూడిని.. తొలుత రాగమాలిక రామకృష్ణ అనే పిలిచేవారని గుర్తుచేశారు. వెలగపూడి రామకృష్ణ కాపీ కొట్టి ఇంటర్ పరీక్షలు రాశాడని.. యూనివర్సిటీ నుంచి పట్టా కొనుగోలు చేశారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. త్వరలోనే వెలగపూడి విద్యార్హతపై కేసు పెడతామని ఆయన స్పష్టం చేశారు.
వెలగపూడికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కమర్షియల్ కాంప్లెక్స్, ఇళ్లు ఉన్నాయని, విశాఖలో కూడా బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని ఆరోపించారు. బైరెడ్డి పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, పట్టాభి, రాజేంద్రకుమార్, సతీష్లు వెలగపూడి బినామీలని విజయసాయిరెడ్డి తెలిపారు.
విశాఖలో వెలగపూడి లిక్కర్ సిండికేట్ అక్రమాలకు పాల్పడ్డారని.. దేవినేని బాజీ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహించి వసూళ్లు చేశారని ఆయన ఆరోపించారు. రజకులకు చెందిన భూమిని లాక్కున్నారని.. ఏసీపీ రంగారావుకు లంచం ఇచ్చి తనపై వున్న రౌడీషీట్ తీయించుకున్నారని సాయిరెడ్డి ధ్వజమెత్తారు.
వెలగపూడి యువజన పేరుతో ఆరిలోవలో అక్రమాలకు పాల్పడ్డారని.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను గాయపరిచిన కేసులో వెలగపూడి నిందితుడని వైసీపీ ఎంపీ ధ్వజమెత్తారు. రుషికొండ లే అవుట్లో రెండు ప్రభుత్వ ప్లాట్లు కొట్టేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
