Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం.. జైలా అత్తగారి ఇల్లా , కార్‌వాన్‌లు కావాలేమో : సజ్జల రామకృష్ణారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి . డీహైడ్రేషన్‌తో మొదలుపెట్టి ప్రాణాలకు ప్రమాదం వుంది అనేంత వరకు వచ్చారని రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా అని ఆయన ప్రశ్నించారు. 

ysrcp mp sajjala rama krishna reddy slams tdp leaders over chandrababu naidu health ksp
Author
First Published Oct 13, 2023, 2:56 PM IST

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా వున్నారంటూ మొన్నటి వరకు ప్రచారం చేశారని.. ఇప్పుడేమో బరువు తగ్గారని అంటున్నారని సజ్జల దుయ్యబట్టారు.   

డీహైడ్రేషన్‌తో మొదలుపెట్టి ప్రాణాలకు ప్రమాదం వుంది అనేంత వరకు వచ్చారని రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని సజ్జల ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు అప్రమత్తంగా వున్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రతీరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని సజ్జల తెలిపారు. 

ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారని ఆయన తెలిపారు. అర్జంటుగా చంద్రబాబును బయటకు తీసుకురావాలన్నదే వీరి తాపత్రయమని సజ్జల దుయ్యబట్టారు. జైలులో సకల సౌకర్యాలు వుండాలనుకుంటున్నారని.. అందరూ ఖైదీల మాదిరిగానే ఆయనను చూస్తామని సజ్జల చెప్పారు. అయినప్పటికి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబుకు ఎన్ని సౌకర్యాలు కావాలంటే అన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. 

ALso Read: నా భర్త ఐదు కిలోల బరువు తగ్గారు.. ఆందోళనగా ఉంది.. భువనేశ్వరి

కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కార్‌వాన్‌లు, ఏసీలు కావాలంటే పెట్టడం కుదరదని ఆయన వెల్లడించారు. అమిత్ షా పిలిపిస్తే లోకేశ్ వెళ్లాడని ఎల్లో మీడియా ప్రచారం చేసిందని.. అమిత్ షాతో ఏం మాట్లాడారో తెలియదు కానీ ఎల్లో మీడియాతో కథనాలు చాలానే అల్లిందని సజ్జల పేర్కొన్నారు. ఏ కోరటులో వుంది.. ఏ బెంచ్ విచారిస్తోందంటూ అమిత్ షా అడిగారంటూ అంటూ రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.  

అమిత్ షాతో భేటీని వీళ్లకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఈడీ నలుగురిని అరెస్ట్ చేసిందని సజ్జల తెలిపారు. లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేశ్‌కు డబ్బులు అందాయని ఆయన ఆరోపించారు. పెండ్యాల శ్రీనివాస్‌కు కూడా డబ్బులు అందాయని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేశ్ ఇద్దరూ విదేశాలకు జంప్ అయ్యారని ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios