రెండు నెలల తర్వాత అమరావతికి చంద్రబాబు.. తొలిరోజే వైసీపీ షాక్
హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికార పార్టీ విమర్శలు చేయడం గమనార్హం. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ వీ గోపాల్రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటూ మరో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా లేఖ రాశారు.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. కరోనా లాక్ డౌన్ ప్రకటించే సమయంలో ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండగా... అక్కడే ఉండిపోయారు. దాదాపు రెండు నెలల తర్వాత ఆయన అమరావతి చేరుకున్నారు. కాగా.. అమరావతిలో అడుగుపెట్టిన ఆయనకు వైసీపీ తొలి రోజే షాకిచ్చింది.
హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అధికార పార్టీ విమర్శలు చేయడం గమనార్హం. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ వీ గోపాల్రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటూ మరో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కూడా లేఖ రాశారు. చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికిన క్రమంలో లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని ప్రధానంగా ఆరోపించారు.
ర్యాలీలకు అనుమతి లేకపోయినా స్వాగత కార్యక్రమాలు నిర్వహించారని.. కనీసం భౌతిక దూరం పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. గరికపాడు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం,గొల్లపూడి, విజయవాడ ప్రాంతంలో చంద్రబాబు ఆగారని.. వందలాది కార్యకర్తలు కనీసం మాస్క్ లేకుండా వచ్చారన్నారు. గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉందని.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నా బాధ్యత లేకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదుపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.