రాజకీయ పార్టీలతో మీటింగ్ ఓ డ్రామా, కుట్రపూరితం: నిమ్మగడ్డపై అంబటి ఫైర్
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో చంద్రబాబునాయుడు పరకాయ ప్రవేశం చేశాడని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు.
అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో చంద్రబాబునాయుడు పరకాయ ప్రవేశం చేశాడని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు.
బుధవారం నాడు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో ఈ తరహాలో ఎందుకు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపలేదని ఆయన ఎస్ఈసీని ప్రశ్నించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ ఎంతవరకు చట్టబద్దంగా వ్యవహిస్తోందో అందరికి తెలుసునని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జడ్పీ ఛైర్మెన్లు, ఎంపీలుగా చంద్రబాబు చెప్పినవారిని నామినేట్ చేస్తే సరిపోతోందన్నారు. ఎస్ఈసీని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
రాజకీయ పార్టీలు చెప్పిన అభిప్రాయాలన్నీ నిమ్మగడ్డ ఇచ్చిన సలహాలేనని ఆయన చెప్పారు. కరోనా వైరస్ తగ్గిన తర్వాత ఎన్నికలు జరగాలి... ఎన్నికలు తప్పనిసరిగా జరిగి తీరాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే కరోనా మొదటి దశ ముగిసిపోతోంది. రెండో దశ కూడ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు అంబటి. కరోనా పూర్తిగా అంతమైన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు.
అయితే కరోనా అంతం కాకముందే మధ్యలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ చేయడమనేది ఓ డ్రామా అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థ పనిచేసే తీరు ఇది కాదని ఆయన చెప్పారు.
ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాప్తి మరోసారి పెరిగే అవకాశం ఉందనే భయం ఉందని ఆయన గుర్తు చేశారు. ఎస్ఈసీని చంద్రబాబు జేబు వ్యవస్థలా మార్చొద్దని ఆయన హితవు పలికారు.
also read:ఓటమి భయంతోనే కరోనా సాకు: జగన్పై అచ్చెన్నాయుడు ఫైర్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రంతో పాటు దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ సమయంలోనూ. ఏ విషయంలోనూ కూడ పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు.
మార్చి 18వ తేదీన కేంద్ర హోంశాఖకు రాసిన లేఖను తాను రాయలేదని... ఆ తర్వాత ఆ లేఖను తానే రాసినట్టుగా రమేష్ కుమార్ చెప్పిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు.
ఈ లేఖ టీడీపీ కార్యాలయం నుండి వచ్చిందన్నారు. టీడీపీకి ఎన్నికల కమిషన్ కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.కుట్రపూరితంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.