ఏపీ వైసీపీదే, కేంద్రంలో జగనే కీలకం: టీడీపీ లైఫ్ టైమ్ అయిపోయిందన్న సజ్జల
భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక పాత్ర పోషించబోతున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక పాత్ర పోషించబోతున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు.
ఓటమి భయంతోనే సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రివ్యూల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రివ్యూలకు తాజాగా సర్వేలను జోడించి సరికొత్త నాటకానికి తెరలేపారని తెలిపారు.
ఎన్నికలు పూర్తైన తర్వాత చంద్రబాబు ప్రశాంతంగా ఉండొచ్చని కానీ అలా లేరన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల అనంతరం ప్రజల తీర్పు కోసం వేచి చూస్తున్నారే తప్ప చంద్రబాబులా రోజుకో డ్రామా చెయ్యడం లేదన్నారు.
ఎన్నికల ఫలితాలపై నాలుగు సర్వేలు చేయించానని చెప్తున్న చంద్రబాబు ఆ ఫలితాలను మే 19న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబు టీడీపీదే గెలుపు అంటూ ప్రకటించుకోవడాన్ని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
ఓటమి భయంతో చంద్రబాబు రోజుకో డ్రామా ఆడుతున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. జాతీయ చానెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తుంటే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో ఏదో మేనేజ్ చేయిస్తున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ లైఫ్ స్పాన్ అయిపోయిందన్నారు. ప్రస్తుతం కొనఊపిరితో టీడీపీ కొట్టుమిట్టాడుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.