అలా గెలిస్తే... అనర్హత వేటు, జైలు శిక్ష తప్పదు: సజ్జల హెచ్చరికలు
ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే వదిలి.. కొత్తగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై అనుమానం వుందన్నారు సజ్జల
ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే వదిలి.. కొత్తగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై అనుమానం వుందన్నారు సజ్జల.
పచ్చటి పల్లెలో విద్వేషం రెచ్చగొట్టే కుట్ర జరుగుతుందనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా కుట్రలు, హింసకు పాల్పడి గెలిచినా ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం అనర్హత వేటు పడుతుందని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా జైలు శిక్షలు కూడా వుంటాయని ఆయన తెలిపారు.
కాగా, పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సుప్రీం తీర్పు అనంతరం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారోగ్యం కోసమే ఇన్ని రోజులు ఎన్నికలు వద్దనుకున్నామని చెప్పారు.
Also Read:ఈ నెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడించారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే నిలిపివేసి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో కుట్ర ఉందని ఆరోపించారు.
వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తే గందరగోళానికి దారి తీస్తుందని సుప్రీంకు తెలిపినట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే ఎస్ఈసీదే బాధ్యత అని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.