బీజేపీ పిలవకపోయినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి వెళ్లాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోందన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి . ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టింది చంద్రబాబేనని సజ్జల పేర్కొన్నారు. 

ఈ నెల 18న జరిగే ఎన్డీయే పక్షాల సమావేశం నేపథ్యంలో వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పిలవకపోయినా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి వెళ్లాలని టీడీపీ ఉవ్విళ్లూరుతోందన్నారు. ఎన్డీయే సమావేశానికి చంద్రబాబును పిలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. సమావేశానికి పిలుస్తారా .. వెళ్తారా అన్నది ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయమన్నారు. ఒకవేళ అధికారం కోసమే టీడీపీ, బీజేపీ మరోసారి జతకడితే ఆ కూటమికి రంగు, రుచి, వాసన వుండవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టింది చంద్రబాబేనని సజ్జల పేర్కొన్నారు. 

2014లో ఎన్డీయే ప్రభుత్వం వుండి కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అంటున్నారని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు మోసం చేసి అధికారంలోకి వచ్చాడని.. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని తండ్రీకొడుకులిద్దరూ అనుకుంటున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ తానులోని ముక్కే అని సజ్జల ఎద్దేవా చేశారు. 

ALso Read: ‘‘ముందస్తు’’ ప్రచారం వెనుక చంద్రబాబు.. చివరి రోజు వరకు పాలనలోనే : తేల్చేసిన సజ్జల

అంతకుముందు గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు అధికారంలోనే వుంటామని సజ్జల తెలిపారు. ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని ఆయన కోరారు. ఈసారి మా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బ్యాంక్ వస్తుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరు వైసీపీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్నారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా ముందస్తు ఎన్నికలు రావని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

ముందస్తు ఎన్నికలు అనేది చంద్రబాబు గేమ్ ప్లాన్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందస్తు కావాలని కోరుకుంటున్నారని సజ్జల దుయ్యబట్టారు. ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్లు రావొద్దని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు ఆలస్యమైనా , రాష్ట్ర వాటా నుంచి పనులు ప్రారంభిస్తామని సజ్జల స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులు ఎందుకు వద్దంటాయని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. షర్మిల ఒక పార్టీ పెట్టుకున్నాక, ఆమె నిర్ణయాలు ఆమెకుంటాయని, వైసీపీగా మా నిర్ణయాలు మాకుంటాయని ఆయన పేర్కొన్నారు.