వల్లభనేని వంశీ జగన్ను కలిశాడు: వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ
:గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య మాటల మధ్య యుద్దం కారణంగా ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ:గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య మాటల మధ్య యుద్దం కారణంగా ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకొందని వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. వంశీపై వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు.బెంగుళూరులో వంశీ జగన్ను కలిసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
సోమవారం నాడు గన్నవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. తాను ప్రాణభయంతో సీపీని కలిసినట్టుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సీపీ పిలిపించినందునే తనతో పాటు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు వెళ్లినట్టుగా ఆయన గుర్తు చేశారు.
నాలుగేళ్ల కాలంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదైనట్టు చెప్పారు. తనపై ఉన్న కేసులను తప్పించాలని కోరుతూ తన భార్యతో కలిసి వంశీ బెంగుళూరులో జగన్ను కలిశాడని వెంకట్రావు ఆరోపించారు.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వంశీ చేసిన దౌర్జన్యాలను మాత్రమే తాను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించినట్టుగా వెంకట్రావు చెప్పారు. వంశీ ప్రజలకు అనేక సమస్యలను సృష్టించారని వెంకట్రావు ఆరోపించారు. కానీ, తనను గెలిపిస్తే గన్నవరంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తానని వెంకట్రావు చెప్పారు.
మట్టి, చెరువుల తవ్వకాల ద్వారా వంశీ డబ్బులు సంపాదిస్తున్నాడని ఆయన ఆరోపించారు. తాను సౌమ్యుడినని వెంకట్రావు చెప్పారు. కానీ, వంశీ బెదిరింపులకు తాను భయపడనని ఆయన చెప్పారు.వెంకట్రావును ఉద్దేశించిన తన ఫేస్బుక్ లో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యల తర్వాత వైసీపీ అభ్యర్థి స్పందించడం గమనార్హం.
సంబంధిత వార్తలు
యార్లగడ్డకు బహిరంగ లేఖ: కొడాలి నానిని లాగిన వల్లభనేని వంశీ