Asianet News TeluguAsianet News Telugu

Viveka Murder Case : ఆ విషయం నాకు అప్పటి డీజీపీ సవాంగే చెప్పారు.. జగన్ అలా అన్నాడు.. సునీత వాంగ్మూలం..

వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీత పలు దఫాలుగా ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో.. ‘అనుమానితుల జాబితాలో ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చటం మీద జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డికి బదులు నా భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరు అనుమానితుల జాబితాలో చేర్చాలని జగన్ సలహా ఇచ్చారు’.. అంటూ చెప్పకొచ్చారామె.. 
 

YS Sunita CBI testimony alligation on YS Jagan
Author
Hyderabad, First Published Mar 1, 2022, 9:57 AM IST

అమరావతి : ‘వైఎస్ అవినాష్ రెడ్డి,  దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి ( భారతి చిన్నాన్న కుమారుడు)  నాకు కళ్ళ లాంటి వారు’ అంటూ ముఖ్యమంత్రి YS Jagan.. వారు ముగ్గురిని తన వద్దకు పంపించారంటూ అప్పటి DGP Gautam Sawang తమతో చెప్పారని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత CBIకి వెల్లడించారు. ఆ విషయంపై ఇంకా ఏమీ మాట్లాడకుండా ఆ సంభాషణ అంతటితో ఆపేశారని చెప్పారు. ఈ murder caseలో అనుమానితుడైన ఉదయ్ కుమార్ రెడ్డి (తుమ్మలపల్లిలోని కర్మాగారంలో ఉద్యోగి)ని 2019 ఆగస్టు 26, 27, 29 తేదీల్లో పోలీసులు ప్రశ్నించడంతో అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డిలు ఆందోళన చెంది అదే నెల 31న విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారని సునీత వివరించారు.  

జగన్ వారు ముగ్గురిని డీజీపీ వద్దకు పంపించారు అని చెప్పారు. 2019 సెప్టెంబర్ 6న మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో  అప్పటి డిజిపి గౌతమ్ సవాంగ్ ను తాను, తన భర్త కలిసినప్పుడు  ఆయనే ఈ విషయంలో తమతో చెప్పారని వివరించారు. సీఎం జగన్ తీవ్రంగా కలత చెందుతున్నారు. అవినాష్ రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లను నా దగ్గరకు పంపించారు, సాక్షుల విచారణ విపరిణామాలకు దారి తీస్తోంది. అందుకే ఈ కేసులో క్షేత్రస్థాయి దర్యాప్తును నిలిపివేసి కేవలం సాంకేతిక విశ్లేషణ మాత్రమే చేపడతాం. హత్యకేసు దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. టిడిపి నాయకులు బీటెక్ రవి,  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను విచారించడం లేదు’ అని సవాంగ్ తమతో చెప్పారని ఆమె తెలిపారు. వివిధ సందర్భాల్లో  సిబిఐ అధికారులకు సునీత ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటిలో ప్రధాన అంశాలు ఇవి… 

ఫోన్లు చేసి ఒత్తిడి.. విచారించకుండానే వెనక్కి…
 2019 జూన్ లో కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. నేను, నా భర్త తరచూ ఆయనను కలుస్తూ.. మాకు తెలిసిన వివరాలు, సమాచారం చెప్పేవాళ్ళం. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలకు సన్నిహిత మిత్రుడైన ఉదయ్ కుమార్ రెడ్డి  వివేకా హత్యకు గురైన రోజు( 2019 మార్చ్ 15)న  వేకువజామున  మూడున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు  ముఖ్యమంత్రిని, డీజీపీని  కలిశారు. 2019 సెప్టెంబర్ లో  ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి లను  విచారించేందుకు ఎస్పీ మహంతి పులివెందుల నుంచి కడప తీసుకువెళ్లారు. వారు మార్గమధ్యంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు ఫోను చేసి దర్యాప్తును ప్రభావితం చేయాలని చూశారు.  దీంతో వారిని కడప తీసుకెళ్లకుండానే  మధ్యలో (నందిమండలం) నుంచి  పులివెందులకు పంపించేశారు.

నా కుమారుడి జీవితం కూడా చూసుకోవాలిగా..  అన్న ఏకే మహంతి..
వివేకా హత్య కేసు డైరీని చాలా హడావిడిగా సిద్ధం చేశారు. దీనిపై ఎస్పీ అభిషేక్ మహంతిని అడిగితే అది సాధారణ విషయమే అన్నారు. ఆయన సెలవులో వెళ్తున్నారని కేసు సిఐడికి అప్పగిస్తారని ప్రచారం జరగడంతో నేను అప్పటి డిజిపి గౌతమ్ సవాంగ్ కు ఫోన్ చేసి.. అది నిజమేనా? అని అడిగాను. అభిషేక్ మహంతిని కడప ఎస్పీ పోస్ట్ నుంచి రిలీజ్ చేయాలని ఆయన తండ్రి, మాజీ డీజీపీ  ఏకే మహంతి కోరడంతో  రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. దీంతో నేను, నా భర్త హైదరాబాద్ లో ఏకే మహంతిని కలిశాం. ఆయన మాతో మాట్లాడుతూ.. ‘ కేసు స్టాప్ వాచ్ మాదిరిగా, రిమోట్ కంట్రోల్ మాదిరిగా జరగకూడదు. క్షేత్ర స్థాయి దర్యాప్తు, సాంకేతిక విశ్లేషణ సమాంతరంగా జరగాలి. అలా చేయకపోతే  దర్యాప్తు  ముందుకు కదలదు.  నా కుమారుడి వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది’  అని అన్నారు.  2019 సెప్టెంబర్ 26న  గౌతమ్ సవాంగ్ కు మరోసారి కలిశాం.  24 గంటల్లోనే అన్బురాజన్ ను  కడప ఎస్పీగా నియమించారు. ఆ తర్వాత మేము కలిస్తే..  అంతకుముందున్న దర్యాప్తు బృందాల నుంచి తనకు ఎలాంటి  మార్గ నిర్దేశము  లేదు అన్నారు. అభిషేక్ మహంతి వెళ్లిపోయిన తర్వాత పాత దర్యాప్తు బృందాలు ఏవీ లేవని చెప్పారు.

సీబీఐ విచారణ కోరుతూ జగన్ కి దెబ్బ తింటుందేమోనని ఆలోచించా…
మా నాన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు.  సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తే జగన్ కెరీర్ దెబ్బతింటుంది. అతని రాజకీయానికి వ్యతిరేకంగా ఏమైనా పరిణామాలు జరిగితే ఈ సిబిఐ కేసు అందుకు ఒక కారణం అవుతుందేమో అని ఆలోచించాను. రాజకీయంగా అతనికి చిక్కుముళ్లు ఎదురవుతాయని అనుకున్నా.. ఒకదశలో పిటిషన్ వేయద్దని కూడా భావించాను. కానీ నాన్నను చంపిన దోషులను పట్టుకోవాలంటే నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను.  నీతో పాటు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నావని చాలా మంది చెప్పారు. 

కానీ మా నాన్నను చంపిన వారు ఎవరో తెలియాలంటే సీబీఐ విచారణ కోరాను. 2011లో లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగినప్పుడు జగన్,  షర్మిల మా నాన్నను కొట్టారని  వదంతులు వున్నాయి. అది నిజం కాదు. జగన్ కాంగ్రెస్ను వీడి,  కొత్త పార్టీ పెట్టడంపై మా నాన్నకు భేదాభిప్రాయాలున్నాయి. ఇదే విషయం మీద కుటుంబ సభ్యులతో ఆయన అనేక సార్లు చర్చించారు. 2010 క్రిస్మస్ సందర్భంగానూ ఇదే మాట అన్నారు.

ఆ తర్వాత నుంచి కలవలేదు..
సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో మొదట నేనే పిటిషన్ వేయాలని అనుకున్నా.  ఢిల్లీలో ఉండడం వల్ల ఆ పిటిషన్పై మా అమ్మ సంతకం చేయాల్సి వచ్చింది.  దోషుల్ని పట్టుకుంటాం అని  2019 జూన్ లో జగన్ నాకు హామీ ఇచ్చారు.  దీంతో సిబిఐ విచారణ కోరడం మీద వెనక్కి తగ్గాలని అనుకున్నాం.. అదే ఏడాది సెప్టెంబర్లో  జగన్ తో మరోసారి దీనిపై మాట్లాడాను. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సంప్రదించిన తర్వాతే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించిన రెండో అఫిడవిట్ ను సిద్ధం చేశాం. ఆ తర్వాత నుంచి ఈ అంశంపై కలవడానికి వారు నిరాకరించారు.

ఫ్యామిలీ మీటింగ్ అంటే  టైం లేదన్నారు…
మా నాన్న హత్య విషయం మీద చర్చించేందుకు కుటుంబ సభ్యులతో బేటీ ( ఫ్యామిలీ మీటింగ్) ఏర్పాటు చేయమని జగన్ కు చెప్పాలని వైఎస్ విజయమ్మను కోరాను. విజయమ్మ జగన్ కు ఫోన్ చేసి ఈ విషయం చెబితే ఆయన నవ్వారు. అలాంటి భేటీలకు ఒక గంట కూడా తాను సమయం కేటాయించాలన్నారు. తర్వాత 2019 అక్టోబర్ 6న తాడేపల్లిలోని జగన్ అధికారిక నివాసంలో భేటీ ఖరారయ్యింది. నేను, నా తరఫున మా పెదనాన్న జార్జి రెడ్డి భార్య భారతీరెడ్డి, మా అమ్మ, నాన్న సోదరి విమల, సోదరులు సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు వెళ్లాం. మేం లోపలికి వెళ్లేసరికి జగన్ తో పాటు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామకృష్నారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి పని ఉందంటూ వెంటనే వెళ్లిపోయారు. 

అనుమానితుల జాబితాలో ఉదయ్ పేరు చేర్చటం మీద జగన్ సందేహం..
నాన్న హత్యకు సంబంధించిన పరిణామాలన్నింటినీ ఈ భేటీలో జగన్ తో చెప్పాను. అనుమానితుల పేర్ల జాబితాను జగన్, గౌతమ్ సవాంగ్, సజ్జల రామకృష్ణారెడ్డి సహా అక్కడున్న వారందరికీ అందించాను. అనుమానితుల జాబితాలో ఉదయ్ కుమార్ రెడ్డి పేరు చేర్చటం మీద జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఉదయ్ కుమార్ రెడ్డికి బదులు నా భర్త పేరు, ఎంవీ కృష్ణారెడ్డి పేరు అనుమానితుల జాబితాలో చేర్చాలని జగన్ సలహా ఇచ్చారు. ఆయనతో నేను వాదించాను. అవసరమైతే నా భర్త మీద కూడా దర్యాప్తు చేయాలని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని చెప్పాను. సీబీఐకి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తే అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోతారని, అప్పుడు అతనికి ఏమీ కాదంటూ జగన్ చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు సీబీఐకి వెడితే తనకు (జగన్ కు) 12వ కేసు అవుతుందని అన్నారు. 

శివశంకర్ రెడ్డి పై అనుమానం పడినప్పుడల్లా నా భర్త పేరు తెచ్చేవారు..
హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్రెడ్డే కీలకం అంటూ జగన్ వద్ద అనుమానాలు  వ్యక్తం చేశాను. అలా అన్న ప్రతిసారి నీ భర్తను కూడా అనుమానితులుగా భావించాలి’ అంటూ జగన్ నుంచి నాకు సమాధానం వచ్చేది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరాల్సి వచ్చిందో  వై వి సుబ్బారెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి ల ద్వారా  జగన్కు అనేక సందర్భాల్లో తెలియజేశాను.  2019 డిసెంబర్ 29న  సజల తో మాట్లాడాను. ‘ ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి… బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి  పాత్ర ఉందని తెలిస్తే దాన్ని అందరూ రాజకీయ నిండగానే పరిగణిస్తారు.  ఎవరు నమ్మరు.  దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి  పాత్ర ఉందని తేలితే  దర్యాప్తు సరిగా జరగలేదని వైసిపి నాయకత్వమే  ఆరోపిస్తోంది.  నా భర్త  పాత్ర  ఉందని తేలితే   వైసిపి హయాంలో దర్యాప్తు సరిగా జరగలేదని  నేను అనుకుంటా.  అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించారని కోరుతున్నా’  అని వివరించాను.  శివ శంకర్ రెడ్డి  దోషి అని తేలి, ఆయన అరెస్టు అయితే ఆ నిజాన్ని వైసిపి నాయకత్వం అంగీకరిస్తున్నానని హామీ ఇవ్వగలరా అని సజ్జల ను అడిగితే ఇవ్వలేను అన్నారు.

 ఏడాది పాటు కేసు ముందుకు సాగలేదు…
మా నాన్న హత్యకు గురైన తర్వాత ఏడాదిపాటు కేసు ముందుకు కదలలేదు.  నిష్పక్షపాత దర్యాప్తు  కొనసాగలేదు.  దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు అనేక లేఖను రాశాను.  నా సందేహాలు,  అనుమానితుల జాబితాలో కూడా అందించాను.  అయినా ఫలితం లేదు.  సిబిఐ దర్యాప్తు కోసం  హైకోర్టు ఆశ్రయించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ల పాత్రపై నేను అనుమానం వ్యక్తం చేస్తుండడంతో…  జగన్ సతీమణి భారతికి నాకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

నా తండ్రి హత్య ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందారు.  అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మా నాన్న అనుచరుల్ని ఇప్పుడు ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. వారికి ఏ పనులు చేయట్లేదు.  భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు నా తండ్రి పట్ల దురభిభిప్రాయంతోనే ఉండేవారు. బయటకు మాత్రం స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటించేవారు.

‘వైయస్ రాజా రెడ్డి,  వైయస్ చిన్నకొండారెడ్డి కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. కానీ బయటకు మాత్రం  అంతా బాగానే ఉంటారు.  వైయస్ భాస్కర్ రెడ్డి,  వైఎస్ మనోహర్రెడ్డి,  వైఎస్ అవినాష్ రెడ్డి,  దేవిరెడ్డి శివశంకర్రెడ్డి లు 2017 ఎమ్మెల్సీ  ఎన్నికల్లో నా ఓటమికి ప్రయత్నించారు. వారిని వ్యతిరేకించేది  నేను ఒక్కడినే కాబట్టి నన్ను ద్వేషిస్తున్నారు’… అని మా నాన్న హత్య కు రెండు, మూడు నెలల ముందు నా భర్త తో చెప్పారు.

కడప టికెట్ షర్మిలకు రావాలని భావించారు…
- 2019 ఎన్నికల్లో కడప లోక్సభ టికెట్ అవినాష్ రెడ్డి కి బదులుగా షర్మిలకు రావాలని మా నాన్న భావించారు. మీరే పోటీ చేయాలని మా నాన్న అనుచరులు అన్నా ఆయన అంగీకరించలేదు. తాను  క్రియాశీల రాజకీయాల నుంచి  20 విరమించుకున్నానని  వారితో చెప్పారు. కడప టికెట్ను విజయమ్మ షర్మిల పేరును ప్రతిపాదించారు.

-వివేకాది హత్య అంటూ సిఐ శంకరయ్య తనతో చెప్పారని,  ఎంపీ టికెట్ వివేకాకు ఇస్తారేమో అన్న అనుమానంతో హత్య జరిగి ఉండొచ్చని నాన్న సోదరుడు వైయస్ ప్రతాపరెడ్డి మా అమ్మతో చెప్పారు.

- జగన్కు అవకాశం ఇవ్వడం కోసం రాజకీయాల్ని విడిచిపెట్టి వద్దామని మా నాన్న రెండున్నర దశాబ్దాల కిందటే అనుకున్నారు. వివిధ కారణాలతో అది సాధ్యపడలేదు.  దీంతో  జగన్  మా నాన్న నన్ను అపార్థం చేసుకున్నారు.  2011లో  పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు.  2017 లో జగన్  కోరిక మేరకు వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేశారు.

- అవినాష్  చిన్న పిల్లోడు.  లోక్సభకు సరైన అభ్యర్థి అని  మా నాన్న భావించి ఉండొచ్చు.

- రాజకీయాల వరకు నా తండ్రికి  భాస్కర్ రెడ్డితో ఒత్తిడితో కూడిన సంబంధాలు ఉండేవి.

నాన్న మరణ వార్త తెలిసీ…  జగన్ పులివెందులకు వెంటనే బయలుదేరి బయలుదేరి రాకపోవడంపై సందేహించా…
 మా నాన్న  మరణ వార్త తెలియగానే హైదరాబాద్ నుంచి నేను, నా భర్త, మా అమ్మ,  కుటుంబ సభ్యులంతా పులివెందులకు బయల్దేరాం.  చాలా దూరం వెళ్లి పోయాం కూడా.  అంత్యక్రియలు ఎప్పుడు అనే చర్చ వచ్చినప్పుడు..  జగన్ తో మాట్లాడాలి అని  మా అమ్మ నాకు సూచించారు.  తనతో మాట్లాడితే.. అంత్యక్రియల విషయంపై  తాను నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. అది హత్యేనని  నాకు  అప్పటికే  అనుమానం ఉన్న  జగన్,  భారతిలతో  నేను పంచుకోలేదు.  వారూ ఆ విషయం నాతో చర్చించలేదు.  నేను ఫోన్ చేసినా సమయానికి  వారిద్దరూ  ఇంకా హైదరాబాదులోనే ఉన్నారు.  మా నాన్న చనిపోయారు అని  తెలిసి కూడా  వారు పులివెందులకు ఎందుకు బయలుదేర లేదు?  అన్న సందేహం కలిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios