నాకు ప్రభుత్వం ఇచ్చిన కారు మహా డొక్కుది : కొత్తది కావాలంటూ జగన్ డిమాండ్
స్కార్పియో వద్దు, పార్చ్యూనర్ కావాలి
ప్రతిపక్ష నాయకుడిగా వున్న తనపై ఏపి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తనకు కేటాయించిన వాహనం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డొక్కు స్కార్పియో వాహనాన్ని మార్చి అధునాతన పార్చ్యూనర్ వాహనం ఇవ్వాలని జగన్ తాజాగా అడిషనల్ డిజిపి కి లేఖ రాశారు. ఈ వాహనం ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో భద్రతా పరమైన సమస్యలు ఏర్పడుతున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
వాహనం మార్చాలని ఇప్పటికే జగన్ మూడుసార్లు ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ డిజిపి లేఖ రాశారు. తనకు కేటాయించిన కారు రెండుసార్లు కర్నూలులో, ఒక సారి హైదరాబాద్ లో రోడ్డుపైనే మొరాయించినట్లు జగన్ జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తరచూ ప్రయాణంలో ఆగిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వారు తెలిపారు.
ప్రస్తుతం జగన్ కు కేటాయించి స్కార్పయో 2011 మోడల్ కు చెందింది. దీన్ని మొదట శ్రీకాకుళంలో కొందరు అధికారులు రెండేళ్ళ పాటు వాడాక జగన్ కు కేటాయించారని సెక్యూరిటి సిబ్బంది తెలిపారు. ఇది మొరాయిస్తుండటంతో ప్రస్తుతం జగన్ తన సొంత వాహనాన్ని వాడుతున్నట్లు వారు తెలిపారు.
గత నెలలో ఇదే విషయాన్ని జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. అయినా పట్టించుకోకపోవడంతో మరోసారి లేఖ రాశారు. ఇటీవలే కొందరు నాయకులకు నూతన వాహనాలను కేటాయించినప్పటికి తనకు కేటాయించలేదని జగన్ ఆరోపిస్తున్నారు.