ఈ జిల్లా పేరు అల్లూరి సీతారామరాజు జిల్లాగా మారుస్తా : జగన్
ఇంతకుముందు కృష్ణా పేరు, ఇపుడు పశ్చిమ గోదావరి పేరు
వైసీపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జిల్లా పేరును మార్చనున్నట్లు ప్రకటన చేశాడు. ఇంతకుముందే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని సంచలన ప్రకటన చేసిన ఆయన తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పేరును మార్చనున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలో బాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఆకివీడులో ప్రసంగిస్తూ... అధికారంలోకి రాగానే ఈ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతానని హామీ ఇచ్చారు. బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన తెలుగువాడు, మన్యం వీరుడు అల్లూరి పేరు భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
ఇదే సభలో చంద్రబాబు పాలనపై కూడా జగన్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత ఏపీలో ఉన్నది ఓ మోసగాడైన, డ్రామాలాడే సీఎం అని అభివర్ణించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని, నిరుద్యోగ బృతి ఇస్తానని డ్రామాలాడి అధికారం రాగానే వారిని మోసం చేశాడని జగన్ అన్నారు. ఇపుడు సీఎం ఎక్కడైనా కనిపిస్తే నాలుగేళ్లకు కలిసి రూ.96 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిరుద్యోగులకు సూచించారు.
ఇక రాష్ట్నంలోని అమ్మలకు,అక్కలకు, చెల్లెమ్మల పేరు మీద భూమి ఉండేలా చూస్తానని, అలాగే డ్వాక్రా రుణాలు రద్దు చేసి పావలా వడ్డీకి కొత్త రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి పాటు పడతానని జగన్ తెలిపారు.
ఇదివరకు కృష్ణా జిల్లా పర్యటనలో ఆ జిల్లా పేరేను ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పేరును కూడా అల్లూరి సీతారామరాజు పేరుగా మారుస్తానని ప్రకటించారు. దీంతో వైసీపి అధికారంలోకి పేర్ల మారనున్న జిల్లాల లిస్ట్ రెండు కు చేరింది.