Asianet News TeluguAsianet News Telugu

57 నెలలు కడుపు మాడ్చి, చివరి మూడు నెలల్లో అన్నం పెడ్తాడట: బాబుపై జగన్

కడుపు మాడ్చి అన్నం పెడతానంటున్న చంద్రబాబు నాయుడు అన్న అనాలా లేక దున్న అనాలా మీరే తేల్చాలని వైఎస్ జగన్ సూచించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు కొత్త హామీలు ఇస్తున్నాడని అవన్నీ మోసపూరితమేనన్నారు. చంద్రబాబు హామీలు చూస్తుంటే కొత్తసినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు. 

YS Jagan says Chnadrababu is playing dramas
Author
Ananthapuram, First Published Feb 11, 2019, 4:17 PM IST

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేసి ఇప్పుడు ఎన్నికలు వస్తాయని నానా హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడా లేని హామీలు ఇచ్చి వాటిని అమలు చెయ్యకుండా తుంగలో తొక్కారన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన 119 హామీలను గాలికి వదిలేశారన్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చెయ్యాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుకు గిట్టుబాటు ధర కావాలంటే బాబు సీఎం కావాలి ఇలా ఎన్నో హామీలిచ్చి ప్రజలను నట్టేట ముంచేశారని ఆరోపించారు. 

ఎన్నికల సమయంలో జాబు కావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేసుకున్నారని ఒక వేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.2000 నెలకు ఇస్తామని రెండు వేళ్లు చూపించి ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవడమే లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని ధ్వజమెత్తారు. 

తీరా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది కూడా సగం అంటే నెలకు రూ.1000 ఇస్తున్నాడని విరుచుకుపడ్డారు. అలాగే నాలుగున్నరేళ్లు బీజేపీ, పవన్ కల్యాణ్ లతో సంసారం చేసిన చంద్రబాబు నాయుడు సరిగ్గా ఎన్నికలు వస్తున్నాయన్న ఆర్నెళ్ల ముందు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందన్నారు. 

అంతకు ముందు ప్రత్యేక హోదా సంజీవనా, ప్రత్యేక హోదా కంటే ఏపీకి ఎక్కువే చేశారు, హోదా కోసం ఉద్యమాలు చేసే వారిని జైల్లో పెట్టించారని ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. 

నల్లచొక్కాలు వేసుకుని రోజుకో డ్రామా ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. చిలకా గోరింకలు అసూయపడేలా నాలుగున్నరేళ్లు మోదీతో కాపురం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీపై విరుచుకుపడుతున్నట్లు కొత్త డ్రామాకు తెరలేపాడంటూ ధ్వజమెత్తారు. 

నాలుగున్నరేళ్లు అవ్వతాతలను పట్టించుకోని చంద్రబాబు సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయానికి వారి గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. ఇన్నాళ్లు వృద్ధులు ఎలా ఉన్నారో తెలుసుకోని చంద్రబాబు వైఎస్ జగన్ వృద్ధాప్య పింఛన్ నెలకు రూ.2వేల నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని చూసి చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. 

రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50,000 చెల్లిస్తానని వైసీపీ ఇచ్చిన హామీని చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రకటించింది కాబట్టే చంద్రబాబు రైతు సుఖీభవ అంటూ ఎక్కడా లేని పథకాన్ని తెరపైకి తెచ్చారని విరుచుకుపడ్డారు. 

ఇప్పటికీ వరకు రైతు రుణమాఫీని పూర్తి చెయ్యని చంద్రబాబు నాయుడు సుఖీభవ అంటూ మరో పథకాన్ని తెస్తున్నాడని విరుచుకుపడ్డారు. 57నెలలు ప్రజల కడుపు మాడ్చిన చంద్రబాబు చివరి మూడు నెలల్లో అన్నం పెడతానని మభ్యపెడుతున్నాడని చెప్పుకొచ్చారు. 

కడుపు మాడ్చి అన్నం పెడతానంటున్న చంద్రబాబు నాయుడు అన్న అనాలా లేక దున్న అనాలా మీరే తేల్చాలని వైఎస్ జగన్ సూచించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు కొత్త హామీలు ఇస్తున్నాడని అవన్నీ మోసపూరితమేనన్నారు. చంద్రబాబు హామీలు చూస్తుంటే కొత్తసినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అన్న చేయూత పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ.75వేలు: వైఎస్ జగన్

రూ.3000 ఇస్తే రూ.5000కావాలని అడగండి, ఓటు మాత్రం ఆలోచించి వెయ్యండి: వైఎస్ జగన్

మీకు తగిలిన గాయం నా గుండెకు తగిలింది: వైసీపీ శంఖారావంలో వైఎస్ జగన్

 

Follow Us:
Download App:
  • android
  • ios