AP Minister: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని, లోకేశ్ విద్యాశాఖలో తెచ్చిన మార్పులపై ధైర్యముంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ, ఉపాధ్యాయ నియామకాల చుట్టూ రాజకీయం వేడెక్కింది. విశాఖపట్నంలో జరిగిన ఒక సమావేశంలో రవాణా, యువజన సంక్షేమ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రతిపక్ష వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలు, విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీని కూడా వైసీపీ సరిగ్గా నిర్వహించలేకపోయిందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం రాగానే వేలాది నిరుద్యోగ యువత కలలను నిజం చేస్తూ నియామకాలను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. డీఎస్సీ ప్రక్రియను నిలిపివేసేందుకు 150కి పైగా కోర్టు కేసులు వేసి ఎన్ని ఆటంకాలు సృష్టించినా చట్టబద్ధంగా విజయం సాధించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

ఆ హక్కు వైసీపీకి లేదు

నారా లోకేశ్ విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాల విద్యా వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తీసుకొచ్చారని అన్నారు. నారా లోకేష్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డీఎస్సీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనివల్ల కష్టపడి ఉద్యోగాలు సాధించిన వేలాదిమంది అభ్యర్థులను, వారి కుటుంబాలను అవమానించినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరే హక్కు అసలు వైసీపీకి లేదన్నారు.

11 కూడా రావు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని మంత్రి వివరించారు. పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి మంచి పేరు వస్తుంటే... కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను, ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను చెడగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్షం తన వైఖరిని మార్చుకోకపోతే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి కనీసం 11 సీట్లు కూడా రాకుండా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే డీఎస్సీపై ప్రత్యక్షంగా చర్చకు రావాలని సవాల్ చేశారు.