ఏపీ సీఎం వైఎస్ జగన్  చిత్తూరు డెయిరీ పునరుద్దరణ పనులకు  ఇవాళ  భూమి పూజ చేశారు. వచ్చే ఏడాది  ఏప్రిల్ నాటికి  తొలి విడత ప్లాంట్ లో  ఉత్పత్తి  ప్రారంభం కానుంది.


చిత్తూరు: చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారంనాడు భూమి పూజ చేశారు. రూ. 385 కోట్ల పెట్టుబడితో చిత్తూరు డెయిరీ పునరుద్దరణ చేపట్టనున్నారు. చిత్తూరు డెయిరీ పునరుద్దరణ పనులకు అమూల్ సంస్థ రూ. 385 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్ధ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, పాలు , పెరుగు, పన్నీరు, బట్టర్, మజ్జిగ ఉత్పత్తి చేయనున్నారు. 

20 ఏళ్ల క్రితం చిత్తూరు డెయిరీ మూత పడింది. ఈ డెయిరీని పునరుద్దరించేందుకు అమూల్ సంస్థతో వైఎస్ జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. చిత్తూరు డెయిరీలో అప్పట్లో 3 లక్షల లీటర్ల కెపాసిటీతో పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారం సాగేది. 

తన హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం కలిగించేందుకే చంద్రబాబునాయుడు చిత్తూరు డెయిరీ నష్టాలపాలైన పట్టించుకోలేదని అప్పటి సీఎం చంద్రబాబుపై విపక్షాలు విమర్శలు చేశాయి. చిత్తూరు డెయిరీని పునరుద్దరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

 ఈ మేరకు అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా చిత్తూరు డెయిరీ పునరుద్దరణ పనులకు సీఎం జగన్ ఇవాళ భూమిపూజ చేశారు.చిత్తూరు డెయిరీ ప్లాంట్ నమూనా తో పాటు ఫోటో ఎగ్జిభిషన్ ను సీఎం జగన్ తిలకించారు. 2024 ఏప్రిల్ నాటికి చిత్తూరు డెయిరీ ఉత్పత్తిని ప్రారంభించేలా ప్లాన్ చేశారు.