వైఎస్ జగన్ దసరా కానుక: ఉద్యోగులకు రెండు డీఎలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఎలు ఒకేసారి చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారు. రెండు విడతలుగా డీఎ చెల్లించడానికి జగన్ అంగీకరించినట్లు నాయకులు చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రెండు విడతలుగా డీఎ చెల్లించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు తెలిపారు.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఏపీఎన్జీవో సంఘ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఈ మేరకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని,వారికి కావలసిన సౌకర్యాలను ప్రయోజనాలను తాము తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నట్లు ఎన్జీవో సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఉద్యోగులను డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్ కు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రెండు డిఎలను నవంబర్ లోనే చెల్లించనున్నట్లు తెలిపారు.