అమరావతి భూ స్కామ్: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకెక్కిన జగన్ ప్రభుత్వం
అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తును నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఉత్తర్వులను తొలగించాలని కోరింది.
అమరావతి: అమరావతి భూకుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి భూ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేస్తున్న దర్యాప్తు ఎఫ్ఐఆర్ ను రహస్యంగా ఉంచాలని, దాన్ని వెల్లడించకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టకూడదని కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ ను తొలి నిందితుడిగా చేరుస్తూ 13 మంది నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ దర్యాప్తును నిలిపేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అమరావతి భూ కుంభకోణఁపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎటువంటి విషయాలను కూడా ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదని పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను ఆదేశించింది. దానిపై వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెక్కింది. ఆ ఆదేశాలను తొలగించాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.