ఆటో డ్రైవర్ అవతారమెత్తిన జగన్: పడవ ప్రమాదంపై స్పందన
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు ఆటో డ్రైవర్ అవతారమెత్తారు.
ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు ఆటో డ్రైవర్ అవతారమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదనరావు పాలెం వద్ద ఆయన కాకి చొక్కా ధరించి ఆటో నడిపారు.
ఆయనను ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తామని జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటోవాలాలకు అండగా ఉంటానని చెప్పారు. జగన్ ఆటో ఎక్కడంతో ఆటో డ్రైవర్లు ఆనందపడ్డారు.
ఇదిలావుంటే, గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న ఆయన రామారావుగూడెం వద్ద మీడియాతో మాట్లాడారు.
గత ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో ఇది మూడో పడవ ప్రమాదమని, లైసెన్స్ లేని బోట్లు ఎలా తిరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై హత్యా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలనా లోపం వల్ల జరిగన ఈ ఘటనలు అన్ని ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు.
రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందా అని అడిగారు. ముఖ్యమంత్రి నుంచి టీడీపి నేతల వరకు లంచాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.