చంద్రబాబుపై రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు
- చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసారు.
- శుక్రవారం ఈ మేరకు జగన్ రాష్ట్రపతికి ఓ లేఖ రాసారు.
- తన లేఖలో ప్రధానంగా ఫిరాయింపు రాజకీయాలనే ప్రస్తావించారు.
చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేసారు. శుక్రవారం ఈ మేరకు జగన్ రాష్ట్రపతికి ఓ లేఖ రాసారు. తన లేఖలో ప్రధానంగా ఫిరాయింపు రాజకీయాలనే ప్రస్తావించారు. అవసరం లేకపోయినా, సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలతో పాటు ఎంఎల్సీని ప్రలోభాలకు గురిచేసి అనైతికంగా టిడిపిలో చేర్చుకున్నట్లు ఆరోపించారు. ప్రలోభాల్లో భాగంగా పలువురికి భారీ ఎత్తున డబ్బు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా లేదన్నారు. తమ పార్టీ నుండి ఫిరాయించిన జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనలను వైసీపీ శాసనసభా పక్ష ఉపనేతలుగా పేర్కొంటూ అసెంబ్లీ బులెటిన్ కూడా విడుదలవ్వటం విచిత్రంగా ఉందన్నారు. వారిద్దరినీ అనర్హులను చేయమని తాము లేఖ ఇచ్చిన తర్వాత కూడా బులెటిన్ లో అదే విధంగా కనబడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జగన్ రాష్ట్రపతిని కోరారు.