వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గిందని... సీఎం జగన్ ఆయనను దూరం పెట్టినట్లు రాజకీయ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయనకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్సగించడంతో ఈ ప్రచారాలకు తెరపడింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం, వైఎస్సార్ సిపి (ysrcp) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి (vijayasai reddy)కి మరిన్ని బాధ్యతలు అప్పగించారు. పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా విజయసాయిని నియమించారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్ పేరిట ఓ ప్రకటన వెలువడింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్ తర్వాత రెండోస్థానం ఎవరిదంటూ టక్కున వినిపించే పేరు విజయసాయి రెడ్డి. మంత్రులకు, ఎమ్మెల్యేలు ఎవ్వరికీ ఇయ్యని ప్రాధాన్యత సీఎం జగన్ విజయసాయికి ఇచ్చేవారు. అయితే ఇటీవల పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు ఆ అనుమానాలను మరింత పెంచాయి.
ఈ మధ్య ప్రభుత్వ వ్యవహారాలే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) చూసుకుంటున్నారు. పీఆర్సీ వివాదంలో ఉద్యోగులతో ప్రభుత్వ ప్రతినిధిగా సజ్జల చర్చలు జరపుతూ కీలకంగా వ్యవహరించారు. సీఎం జగన్ కూడా ఈ సమయంలో సజ్జలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని కీలక ప్రకటనలు కూడా ఆయననుండే వెలువడ్డాయి. దీంతో సీఎం జగన్ సజ్జలకు అధిక ప్రాదాన్యత ఇస్తున్న విషయం ఉద్యోగులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమయ్యింది.
ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిని దూరంపెట్టిన సీఎం సజ్జలను దగ్గరయినట్లు రాజకీయ వర్గాల్లోనే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రచారం జరిగింది. ఉద్యోగుల ఆందోళనల సమయంలో అసలు విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు పార్టీ వ్యవహారాలతో ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే విజయసాయి ఒక్కసారిగా సైలెన్స్ కావడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిందంటూ ప్రచారం మరింత జోరందుకుంది.
అంతేకాదు గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డిని స్ధానిక వివాదాల నేపథ్యంలో తప్పించారు. ఆ తర్వాత నుంచి సాయిరెడ్డి కేవలం వైసీపీ పార్టమెంటరీ పార్టీ నేతగా మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో వైసిపిలో విజయసాయి ప్రాధాన్యత తగ్గిందన్న ప్రచారానికి కొత్తగా ఇంచార్జి బాధ్యతల అప్పగింతతో తెరపడనుంది.
ఇప్పటికే రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికల ముగియడంతో సీఎం జగన్ మళ్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. మరో రెండున్నరేళ్ల సమయం వున్నప్పటికి అప్పటివరకు పార్టీ అనుబంధ విబాగాలను బలోపేతం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి ఈ బాధ్యతను అప్పగించారు సీఎం జగన్.
జగన్ తాజా నిర్ణయంతో ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సజ్జలకు, పార్టీ వ్యవహారాల్లో విజయసాయికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలా ఇద్దరు కీలక నాయకుల్లో ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా అటు సీఎంగా, ఇటు పార్టీ చీఫ్ గా జగన్ బ్యాలెన్సింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
