మొదలైన వైసిపి ఎంపిల నిరాహార దీక్ష
ప్రత్యేకహోదా డిమాండ్ తో శుక్రవారం మధ్యాహ్నం వైసిపిలు ఏపి భవన్లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.
ఉదయం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన వెంటనే ముందుగా చెప్పినట్లుగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తమ రాజీనామా పత్రాలను అందచేశారు.
తర్వాత పార్లెమెంటు నుండి వైసిపి నేతలు, శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి ఏపి భవన్ కు చేరుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
వీరికి సంఘీభావంగా పలువురు ఎంఎల్ఏలు, నేతలు కూడా వేదికపై కూర్చున్నారు.అదే సమయంలో గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ నేతలు, శ్రేణులు కూడా ఎంపిలకు మద్దతుగా దీక్షలకు కూర్చున్నారు.
మొత్తంమీద రాష్ట్రమంతా ప్రత్యేకహోదా కావలన్న నినాదాలతో, కేంద్రప్రభుత్వ వైఖరిపై ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిపోయింది.